తెలుగు భాషా స్వరూపం
లక్ష్యం
రమారమి 50 సంవత్సరాలుగా తెలుగు పత్రికలు వస్తున్నాయి. అప్పటప్పటి అవసరాలకు తగినట్లు అప్పటికి తోచిన పద్ధతిలో వార్తలు ప్రచురించటమే గాని వార్తాపత్రికను ఒక నియతరీతిలో ప్రచురించే ప్రయత్నాలు జరగలేదు. పత్రికా భాషను నిర్ణీతశైలిలో ప్రయోగించే పద్ధతి తెలుగులోనే కాక ఏ దేశభాషలోనూ ఏర్పడలేదు.
ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకశైలి ఉండేమాట నిజం. అయితే పత్రికాప్రచురణ ఎవరో ఒక వ్యక్తి చేయగలిగింది కాదు. అందులోనూ దినపత్రికల విషయంలో అసలు సాధ్యంకాదు. రకరకాల అనుభవాలూ, విద్యా సంస్కారాలూ ఉన్న వ్యక్తులు పత్రికల్లో పనిచేస్తుంటారు. వారంతా ఒక ప్రాంతంవారుగాని, ఒక కులంవారుగాని, ఒక మతం వారుగాని కారు. విద్య, కులం, మతం, వృత్తి, ప్రాంతం వంటివన్నీ భాషలో భేదాలు తెచ్చి పెట్టేవే. భాషలో ఉన్న ఒక ప్రత్యేకత వైవిధ్యంలో ఏకత్వం. భిన్న వ్యక్తులు రాసేభాషలో ఏకత్వం సాధించటం అంటే బిన్నవిధమాండలి కాలనుంచి ఒక సాధారణ భాషాలక్షణాన్ని ఏర్పరుచుకోవటమే. ఒకేపత్రిక భిన్న ప్రాంతాలనుంచి ఏక కాలంలో వెలువడేటప్పుడు ఆ పత్రికా భాషలో సాధ్యమయినంత ఏకరూపత లేకపోతే అది 'ఒకే' పత్రిక అనిపించదు. అందువల్ల అందరూ పాటించవలసిన కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలి. ప్రపంచభాషాపత్రికలన్నింటికీ భాషావిషయంగా కూడా కొన్ని నియమనిబంధన లున్నాయి.
నియమం చేసినంతసులభంగా పాటించడం సాధ్యపడదు. అందుకు ప్రయత్నం. సాధన అవసరం. నియమంలో గొప్ప ప్రయోజనాలున్నాయి. మొదటి ప్రయోజనం సంయమనం. రెండోది ఏకరూపత. మూడోది 'నాది' అనే భావంనుంచి 'మనది' అనే అభిప్రాయానికి మారటం. నాలుగోది బహుజనసమ్మతి. ఇలా అనేకం.
సంఖ్యాదృష్టిలో భారతీయభాషల్లో తెలుగుది రెండోస్థానం. అయితే తెలుగు వారిలో చదువుకున్నవాళ్ళ సంఖ్య తక్కువ. నూటికి ఇరవై అయిదుమందికన్నా అక్షరాస్యులు లేరు. వాళ్ళందరూ ఒకే కోవకు చెందినవాళ్ళు కారు. సాధారణ పరిజ్ఞానమున్న సామాన్యులకు వార్తలందించే పత్రిక ఎక్కువమందికి అందుబాటులో ఉన్న సులభ సరళ భాషలో ఉండాలి. పత్రికలు స్వయంగా చదవలేక చదివించుకునే వాళ్ళు లక్షల సంఖ్యలో......................