వీరు కులపతి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య (మాస్టర్ ఇ.కె.) గారి తృతీయ పుత్రులు. తండ్రిగారు నెలకొల్పిన 'జనకులము'లో ఒకటవ తరగతి నుండి మెట్రిక్ వరకు చదువుటయేగాక, వారి వద్ద నుండి వేదము, పూజావిధానము, జ్యోతిష్యము, వాస్తు, సాముద్రికము, హోమియో మొదలగు విద్యలు నేరుగా అభ్యసించిరి. తెలుగు విశ్వవిద్యాలయము (హైదరాబాదు) నుండి M.A.(Astrology), ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం) నుండి M.A. (Sociology) పట్టాలను ప్రథమశ్రేణిలో పొందిరి. వాస్తు, జ్యోతిష్యముల ద్వారా అనేకమందికి వారి జీవిత సమస్యలను అధిగమించుటకు సులువైన తరుణోపాయములను సూచించిరి. జ్యోతిష విజ్ఞానమును హోమియోతో సమన్వయ పరచి, అనేకానేక రోగార్తులకు అలుపెరుగని వైద్యసేవలందించిరి. విదేశీయానము చేసి, ఆ దేశముల యందు ఈ విద్యలలో శిక్షణనిచ్చిరి. ప్రత్యేకంగా తనదైన హాస్యశైలిలో క్లాసులు నిర్వహించిరి. నిరంతరము ఉత్సాహముగా నుండుట, ముఖముపై చెరగని చిరునవ్వు, హాస్య చతుర సంభాషణ ద్వారా ఎదుటి వ్యక్తిని సంతోష పెట్టుట, దైనందిన కార్యక్రమములలో క్రమశిక్షణ వీరి ప్రత్యేకత.