వైదిక సిద్ధాంతం - సింహావలోకనం
మన మేధోజన్య తత్వచింతనా సాంప్రదాయాల కన్నా పురాతనమైన యుగానికి చెందిన రచన వేదం. ఆ ఆదిమ యుగంలో ఆలోచన మన తార్కికమైన హేతుశక్తి కన్నా భిన్నమైన మార్గాలని అనుసరించింది. భాష మన ఆధునిక ప్రమాణాలు అసమ్మతమని భావించే ధోరణులని అలవరచుకుంది. ఆ యుగంలో విప్రోత్తములు, సామాన్య మానవ దైనిక వ్యవహారాలకి, ఇంద్రియ వృత్తులకి అతీతమైన జ్ఞాన రంగాలలో వ్యవహరిస్తున్నప్పుడు ఎప్పుడూ అంతరిక అనుభూతి మీదను, లోజ్ఞానం ఇచ్చే సూచనల మీదను ఆధారపడేవారు. వారి లక్ష్యం ఆత్మప్రకాశనం; తార్కిక నిరూపణం కాదు. వారి ఆదర్శం అంతఃప్రేరణ గల ఋషి సునిశిత బుద్ధి గల తార్కికుడు కాదు. వేదమూలాలకి సంబంధించిన ఈ సత్యాన్ని భారతీయ సంప్రదాయం భద్రంగా పదిలపరిచింది. ఋషి అంటే ఋక్కులని కూర్చిన ఓ వ్యక్తి కాడు; ఓ సనాతన సత్యాన్ని, వ్యక్తికి అతీతమైన జ్ఞానాన్ని, దర్శించిన ఓ ద్రష్ట. వేద భాషని 'శ్రుతి' అంటారు. ఋక్కులలోని లయ బుద్ధి కూర్చినది కాదు. అది వినిపించినది. వ్యక్తికి అతీతమైన జ్ఞానాన్ని అందుకోవడానికి ఆత్మశిక్షణ చేత సంసిద్ధుడైన మానవుడి అంతశ్రవణానికి వినిపించిన, అనంతుడి లోంచి పెల్లుబికిన, ఓ దివ్య ధ్వని, అసలు దృష్టి (చూపు), శ్రుతి (వినికిడి) అనే పదాలు వైదిక పరిభాషకి చెందినవి. ఈ పదాలే కాక వైదిక పరిభాషకి చెందిన మరెన్నో పదాలు వేద జ్ఞానపు ప్రగాఢమైన, పవిత్రమైన తత్వాన్ని సూచిస్తాయి.
ఆత్మప్రకాశనం అన్న వైదిక భావనలో అదేదో మహిమాన్వితమైనది. లోకోత్తరమైనది అన్న భావన ధ్వనించదు. ఆ సామర్ధ్యాన్ని అలవరచున్న ఋషి క్రమబద్ధమైన ఆత్మశిక్షణ ద్వారా ఆ శక్తిని సాధిస్తాడు. జ్ఞానం అంటే ప్రయాణించడం, అందుకోవడం, కనుక్కోవడం, గెలుచుకోవడం. ఆ మార్గాంతంలో కలిగేదే ఆత్మప్రకాశనం. చరమ విజయానికి బహుమతి అత్మతేజం. ఈ యాత్ర అనే భావన, సత్యం దిశగా జీవాత్మ సలిపే యాత్ర అన్న భావన, వేదంలో మనకి తరచు ఎదురవుతూ ఉంటుంది. ఆ యాత్రలో జీవాత్మ ముందుకి సాగుతూ పైపైకి అధిరోహిస్తుంది. దాని ఆకాంక్ష ఫలితంగా కొత్త చైతన్య, తేజో భూమికలు విప్పారుతాయి. ప్రతాపవంతమైన..............................