నిగమశర్మ అక్క పరమపదము
కవి వ్యక్తిత్వము
కవికి రెండు వ్యక్తిత్వములుండును. ఒకటి దైనందిన జీవితమునకు సంబంధించినది. రెండు- కావ్యజీవితమునకు సంబంధించినది. దైనందిన జీవితముచేత కావ్యము, కావ్యజీవితముచేత లోకము ప్రభావితమగును. తాను జీవితమునుండి నేర్చుకొనిన పాఠములను కవి పాఠకులకు చెప్పవచ్చును. తన ప్రత్యేకాభి రుచులను పఠితల తలలపై రుద్ది తీరునని చెప్పలేము. తన ప్రత్యేకాభి రుచులను తన రచనలలో ప్రతిబింబింపజేసియే తీరుననియు జెప్పలేము. కవుల పోకడలు చిత్రముగా కూడా ఉండును. మేదకునిగ కనపడు కవి ప్రచండమైన రచనచేయును. సంప్రదాయస్థునివలె ఉండు రచయిత విప్లవాత్మక రచన చేయవచ్చును. నవ్వుచు, నవ్వించుచు ఆనందమును వెదజల్లుచునుండు ఒక ఆధునిక కవి విషాద గీతికలు వ్రాసినాడు. విద్యార్థులను "మ్యాథ్సు” చెప్పి హడలుగొట్టు లెక్కలు మాస్టరు బాలానందదాయక రచనలు చేయును. ప్రకృతిలో గతితర్కము (Dialectics ofట్లు కవితలోను గతితర్కము (Dialectics of Poetry) ఉన్నదనిపించును. కవి ప్రకృతికిని, అతని కావ్య ప్రకృతికిని సమ, అనులోమ, విలోమ సంబంధముండును. కవి ఒక పద్యములో వేపుడు చేపకూర బాగుగ వర్ణించినాడు. అట్లని ఆ కవికి ఆ కూర ఇష్టమయి తీరియుండునా? శ్రీనాథ కవి వంటకములను చాల రసవంతముగ వర్ణించినాడు కాబట్టి ఇతడు భోజనప్రియుడని సిద్ధాంతము చేయవచ్చునా? తల, తోక, సంగతి, సందర్భములేని కొన్ని చాటువులను ఆధారముగా చేసికొని ఆ మహానుభావుని శ్రీనాథుని భండునిగ చిత్రంపవచ్చునా?
తెనాలి రామకృష్ణుడు హాస్యకారుడా ?
అట్టి దురవస్థయే తెనాలి రామకృష్ణ కవికి కలిగినది. జనశ్రుతిలోనున్న "తెనాలి రాముడు", "తెనాలి రామలింగడు" ఒక హాస్యకాడు. తెనాలి రాముడు, వీరబలుడు, నజీరుద్దీను, బెంజమిన్ ఫ్రాంక్లిన్ వంటి వ్యక్తులను, వారుండిన సంఘ సామూహిక సమయ స్ఫూర్తిని, హాస ప్రవృత్తిని, లోకజ్ఞానమును ప్రతిబింబించు దర్పణములుగను, ప్రతిధ్వనించు పలుకురాళ్లను, ప్రతీకలుగానే పరిగణింపవలెను, వారి కంటగట్టబడిన మాటలన్నింటిని ఆడియుందురనియో, చేష్టలు చేసి యుందురనియో తు.చ. తప్పక నమ్ముట బాలమనస్తత్వమే యగును. ఒక విధముగ వీరు "మిషామేషములు” (Scapegoats)..................