గోదావరి గలగలలు
మేఘసందేశ కావ్యంలో యక్షుడు మేఘానికి ప్రయాణమార్గాన్ని వివరిస్తూ, మేఘం అవంతీదేశంలో ప్రవేశించగానే ఉదయనకథాకోవిదులైన గ్రామవృద్ధులు కనిపిస్తారని చెప్తాడు. ఆ ఉదయనపండితుల గురించి మా మాష్టారు తరచు ప్రస్తావిస్తూ ఉండేవారు.
ఉదయనుడు అవంతీదేశపు రాజు. ఉజ్జయిని ఆయన రాజధాని. ఆయన చరిత్ర, ఆయన ప్రేమకథలు, రసజ్ఞత ప్రజల స్మృతిలో నిలిచిపోయాయి. తర్వాతి రోజుల్లో సంస్కృత, ప్రాకృత సాహిత్యాల్లో ఎన్నో కావ్యాలూ, నాటకాలూ ఆయన కథల చుట్టూ అల్లుకున్నాయి. ఆ కథలు అక్కడి గాలిలో, ఆ గ్రామాల్లో ఇంకా వినిపిస్తూనే ఉంటాయనే అర్థంలో కాళిదాసు మేఘసందేశ కావ్యంలో ఆ ఉదయన కథాకోవిదులు గురించి ప్రస్తావించాడు.
ప్రతి కొత్త తరానికీ ఆ ఉదయనచరిత్రను పరిచయం చెయ్యడం వాళ్ళ పని. గ్రామమధ్యంలో, రథ్యల దగ్గర, రావిచెట్టునీడన, రచ్చబండమీద కూచుని, అనేక సాయంకాలాలు, మరే వ్యాపకం లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా ఉదయనుడి గురించీ, ఉల్లాసభరితాలూ, ఉత్తేజకారకాలూ అయిన అతడి కథలు చెప్పడమే వాళ్ళ పని. అలా ఆ కథలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ పౌరులముందు ఒక ఆదర్శాన్ని, ఇప్పటి భాషలో చెప్పాలంటే, ఒక రోలుమోడలుని ప్రతిష్ఠించేవారు. ఆ కథలు ఆ పౌరస్మృతిలో భాగమైపోయేవి. కాలం గడిచేకొద్దీ ఆ కథల వన్నె పెరిగేదే గాని తగ్గేదికాదు.
నన్నడిగితే ప్రతి భాషకీ, ప్రాంతానికీ, దేశానికీ అటువంటి ఉదయన పండితులు అవసరం. వాళ్ళు అటువంటి కథలు చెప్పడం ద్వారా, ఆ గాథలు తవ్వి తలపోయడం. ద్వారా తమ జాతికొక అభిరుచిని నిర్మిస్తారు. ఆ అభిరుచి కాలక్రమంలో ఒక సంస్కృతిగా రూపొందుతుంది. ఒకప్పుడు సామల సదాశివగారి గురించి మాట్లాడుతూ ఆయన్ని అటువంటి సంస్కృతీ నిర్మాతగా అభివర్ణించాను. ఆయన ముందు చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి,..............