ఆలయం దైవనిలయం
ఆలయం. శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలకు ఆలంబనం. ఆ ఆలయానికి ప్రధానమైన వ్యవస్థలు రెండున్నాయి. అవే నిర్మాణం నిర్వహణ. నిర్మాణ విషయాలను వాస్తు శిల్పశాస్త్రాలు, నిర్వహణ సంబంధ అంశాలను ఆగమాలు వివరిస్తున్నాయి. ఆలయంలో మన సనాతన ధర్మశాఖలు అనేక రకాలుగా విస్తరించివున్నాయి. ఉదాహరణకు ఆలయాలలో వేద పారాయణం చేస్తారు. ఆగమాన్ని అనుసరించి అర్చనలు, ఉత్సవాలు జరుపుతారు. పురాణ, ఇతిహాసాలపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజ్ఞానం, సంస్కృతి విస్తరించడానికి, వర్ధిల్లడానికి కూడా ఆలయాలే ఉపకరిస్తాయి. మన వారసత్వాన్ని తరతరాలుగా నిలబెడుతున్నది ఆలయాలే.
దురాక్రమణలతో దాడులతో భరతభూమిపై ఎన్నో అపురూప దేవాలయాలు శిధిలమైపోయాయి. అయినా ఇప్పటికీ కొన్ని వేల దేవాలయాలు మన ధర్మానికి, కళాభిజ్ఞతకు, విజ్ఞానానికి సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. మనల్ని ఆధ్యాత్మికతవైపు నడిపిస్తూనే ఉన్నాయి. వేదాలు, ఆగమాల యొక్క ప్రధాన లక్ష్యం అదే.
భక్తునికి భగవంతుని చేరే మార్గాన్ని చూపడమూ ఆవశ్యకమే, విగ్రహరూపంలో వున్న భగవంతుని ఉపచారమార్గంలో అర్చించడానికి మార్గాన్ని చూపేవి ఆలయాలు. మానవ జీవన వికాసంలో ఆలయాలు చేసిన సేవలు నిరుపమానం.......................