అర్థశాస్త్రంలోని విషయం
మార్క్సిజం లెనినిజం అనే సమగ్ర శాస్త్రంలో మార్క్సిస్టు - లెనినిస్టు అర్థశాస్త్రం ఒక విభాగం. మార్క్సిజం - లెనినిజం సామాజికాభివృద్ధి. సామ్యవాద విప్లవము, కార్మికవర్గ నియంతృత్వము, సామ్యవాద కమ్యూనిస్టు సమాజ నిర్మాణ సూత్రాలను వివరించు శాస్త్రము. ఇది ఏకైక సమగ్ర సిద్ధాంతం. దీనిలో మూడుభాగాలున్నాయి - తత్వశాస్త్రము, అర్థశాస్త్రము మానవ సామాజిక జీవితం పునాదిని గురించి వివరిస్తుంది గాన, మార్క్సిజం - లెనినిజంలో ఇది ముఖ్యభాగమయింది.
భౌతిక సంపదల ఉత్పత్తి సామాజిక జీవితానికి పునాది : యుగయుగాలుగా ప్రజలు మానవ సామాజికాభివృద్ధి కారణమేమిటాయని ఆలోచిస్తూ వచ్చారు. రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉదాహరణకు మతప్రచారకులు అభివృద్ధి కంతటికీ భగవదేచ్ఛయే కారణమని చెబుతూవచ్చారు. కాని శాస్త్రమూ, అనుభవమూ కూడా లోకాతీతశక్తులు (Supernatural forces) ఏవీలేవని రుజువు చేశాయి. ఈనాటి బూర్జువా పండితులనేకమంది భావిస్తున్నట్లు సామాజికాభివృద్ధి భౌగోళిక పరిసరాలపైన, అనగా నిర్దిష్టమైన స్వాభావిక పరిస్థితులపైన (శీతోష్ణస్థితి, నేల స్వభావం, ఖనిజాలు మొదలగునవి) చాలా వరకు ఆధారపడి యుంటుందని మరొక అభిప్రాయముండేది. సామాజికాభివృద్ధికి దోహదం చేయుటలో భౌగోళిక పరిసరాలకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుందనడం సహేతుకమే. కాని దానికి నిర్ణాయకపాత్ర కలదనడం సరిగాదు. గత 3000 సంవత్సరాల కాలంలో యూరప్ ఖండంలో మూడు సాంఘిక వ్యవస్థలు ఒకదాని తరువాత ఒకటి మారాయి. మధ్య, తూర్పు ఐరోపాలలో నాలుగు సాంఘిక వ్యవస్థలు మారాయి. కాని ఈ కాలంలో యూరప్ లోని భౌగోళిక పరిస్థితులు యథాతథంగా ఉన్నాయి. ఒక వేళ కొద్దిగా మారినా భౌగోళిక శాస్త్రజ్ఞులు పరిగణనలోనికి తీసుకోనంత తక్కువ మాత్రమే మారాయి................