స్వాగతం
ఈతకోట సుబ్బారావు గారి 'కాశీబుగ్గ' కథల సంపుటి మీ చేతుల్లో ఉంది. ఇందులో పదహారు కథలున్నాయి. ఈ కథలన్నీ ఆసాంతం చదివాక మీకు ఎంతో కొంత అశాంతి కలుగుతుంది. ఈ అశాంతి ప్రయోజనమేమిటి? ఇటువంటి అశాంతి లేకుండా మీ రోజువారీ జీవితం ప్రశాంతంగా సాగిపోవడమే మంచిదేమో కదా! చూస్తూ, చూస్తు మనస్సును కలతపరిచే అనుభవాన్ని మనం చేజేతులా ఎందుకు ఆహ్వానించాలి? కాని, ఇటువంటి అనుభవాన్ని ఆహ్వానించక తప్పదు. ఇటువంటి కథలు మళ్లీమళ్లీ మనం చదవకతప్పదు. ఇటువంటి కథల్ని మనకోసం రచయితలు మళ్లీ మళ్లీ రాయకతప్పదు. అన్నిటికన్నా ముందు ఈ కథల ప్రయోజనం, జీవితం మనమనుకున్నంత సజావుగా లేదని చెప్పటమే. సజావుగా లేదని మనకు తెలిసినా, ఎక్కడో మనం మనల్ని నమ్మించుకుంటూ మభ్యపెట్టుకుంటూ ఉన్నాం కాబట్టి, ఈ కథల లక్ష్యం మనల్ని మన క్రమాన్వితసుఖం నుంచి బయటపడేయటమే.
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మహాసాహిత్యమంతా కూడా ముఖ్యంగా కథా సాహిత్యం ఇట్లాంటి సత్యం చెప్పటం కోసమే ప్రభవిస్తూ వచ్చింది. మృత్యువు ముఖాముఖి నిల్చున్నప్పుడు దాన్ని | ఎన్ని విధాల తప్పించుకోవాలో అన్ని విధాలా తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మరి ప్రత్యామ్నాయమూ లేనిక్షణాన, లేదని నిశ్చయంగా తెలిసిన క్షణాన, మనిషి చివరి ప్రయత్నంగా కథలు చెప్పడానికి పూనుకుంటాడు. అరేబియా రాత్రుల కథలు చూడండి. ఆ కథా పరంపర ముఖ్య ఉదేశం ఏమిటి? తెల్లవారితే తప్పని మృత్యువుని మరొకరోజుకి.. మొదట మరొకరోజుకి, అట్లా వెయ్యినొక్కరాత్రులు వాయిదా వేసుకుంటూ వెళ్లడమే కదా! "ది ! అరేబియన్ నైట్స్' (ద మోడ్రన్ లైబ్రరీ, 2001) కి రాసిన అత్యంత స్ఫురణాత్మకమైన ముందుమాటలో ప్రసిద్ధ రచయిత్రి ఎఎస్ బ్యాట్ ఈ విషయాన్నే మరింత వివరంగా చర్చించింది. చివరికి తన వ్యాసం ముగిస్తూ, ఆమె ఇలా రాసింది:
1994లో సారాజవేలో బాంబుల వర్షం కురుస్తున్నప్పుడు అమస్టర్ డామ్ లోని రంగస్థల కార్యకర్తల బృందం కథలు చెప్పే ప్రక్రియ మొదలు పెట్టింది. యుద్ధం జరుగుతున్నంత............