'చివరకు మిగిలేది'
నవలలోని స్త్రీ పాత్రలు : ఒక పరిశీలన
సమాజంలోని ఇతర అంశాలన్నీ ఆర్థికాంశాల చేతనే ప్రభావితమౌతాయని మార్క్స్ మహనీయుడు చెప్పిన సిద్ధాంతం సాహిత్యాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో సమాజంలోని ప్రతిసంబంధం స్త్రీ పురుషుల లైంగిక సంబంధాల ఆధారంగానే నిర్ణయించబడుతుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ చేసిన ప్రామాణీకరణం కూడా ఆస్థాయిలోనే ప్రభావం చూపింది. స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడ్డ నవలలు తెలుగులో చాలా వచ్చాయి. అలాంటి నవలల్లో ప్రముఖమైనది బుచ్చిబాబు చివరకు మిగిలేది.
నవల స్వభావం ఇతివృత్తం
'చివరకు మిగిలేది'లో దయానిధి పాత్ర గమనాన్ని, కొన్ని చోట్ల అతని మానసిక పరిస్థితిని గమనించినట్లైతే ఈ నవల మనోవైజ్ఞానిక లక్షణాలను సంతరించుకున్నట్లుగా కనిపిస్తుంది. దయానిధి పాత్రకు ఆధారభూతమైన సామాజిక, సాంఘిక విషయాలు నవలలో కళ్ళకు కట్టినట్లు వర్ణించబడ్డాయి. కాబట్టి దీనిని సాంఘిక నవల అనడం కూడా సరయినదే. కాత్యాయనీ విద్మహేగారి అభిప్రాయం ప్రకారం చివరకు మిగిలేది స్త్రీ పురుష సంబంధాలను ప్రధానంగా చర్చించిన నవల. ఈ నవల వ్రాయడంలో బుచ్చిబాబుపై సోమర్సెట్ మామ్ (Somerest Maugham) ప్రభావం కనిపిస్తుంది. ప్రేమించబడలేక పోవడం అనే విషాదం నుండి బయటపడడానికి, ఆంతరంగిక వేదన నుండి బయటపడడానికి ఈ నవల రాసినట్లు బుచ్చిబాబు చెప్పుకొన్నాడు. సోమర్సెట్ మామ్ కూడా వ్యక్తిగత విముక్తి కోసం ఆఫ్ హుమన్ బాండేజ్ (Of Human Bondage) రాసుకోవడం బుచ్చిబాబుకు ప్రేరణ కల్గించింది..................