వైదిక వాఙ్మయం
వేదాలు - వైదిక సాహిత్యం
విషయదృష్టితో పరిశీలించినట్లయితే వేదాలకు, వైదిక సాహిత్యానికి భేదమున్నది. 'వేదాలు' అంటే మంత్రు సంహితలైన నాలుగు గ్రంథాలు మాత్రమే. వైదిక' అంటే వేద సంబంధమైన విజయవిజ్ఞానయుక్తమైన గ్రంథాలన్ని చేరుతవి. అవి - బ్రాహ్మణ, ఆర్యణక, ఉపనిషత్తులు. ఇంకా వేద పఠనానికి, అవగాహనకు ఉపయోగపడే వేదాంగాలు కూడా వైదిక సాహిత్యంలో చేరుతవి.
వేదాలు సమస్త హిందూజాతికి ప్రాచీనమైన పవిత్ర గ్రంథాలు. 'వేద'' జ్ఞానే అన్న ధాతువునుంచి నిష్పన్నమైంది. దేని ద్వారా జ్ఞానప్రాప్తి కలుగుతుందో అది వేదమనబడుతుంది. వేదాలు సమస్త జ్ఞానానికి ప్రోతస్సులని భారతీయుల నమ్మకం. జ్ఞాన ప్రతిపాదకమైన 'వేద' శబ్దం తర్వాత వివిధ విషయ గ్రంథాలకు జోడింపబడుతూ వచ్చింది. ఉదాహరణకు నాట్యవేదం, ఆయుర్వేదం, ఇతిహాసవేదం, పురాణవేదం ఇత్యాది.
ఈశ్వరీయ జ్ఞానం
వేదాలు అపౌరుషేయాలని ప్రసిద్ధి. అంటే అవి వ్యక్తులచేత వ్రాయబడలేదని అంటారు. జ్ఞానం శాశ్వతమైంది. ఈశ్వరీయమైంది. అటువంటి జ్ఞానాన్ని తపఃసంపన్నులైన ఋషులు దర్శించి ప్రకటింపగలిగారు. కాని వారు ఆ జ్ఞానానికి కర్తలు కారు. అందుచేతనే వేదాలను అపౌరుషేయాలని అన్నారు.
వేదాలకు 'శ్రుతు' లని కూడా పేరు. 'శ్రుతి' అంటే 'వినుట' అని అర్థం. ఋషులు వేదజ్ఞానాన్ని పరమాత్మ నుంచి విన్నారు కాబట్టి వేదాలకు శ్రుతులని పేరు కలిగింది. వేదాలు లిఖితరూపంలో కాక శ్రవణరూపంలోనే పూర్వకాలంలో ప్రచారంలో వుండేవి కాబట్టి వాటికి శ్రుతులని పేరు కలిగిందని మరొక వ్యాఖ్యానం.
ఈశ్వరుడు లేడనే వారినైనా భారతీయులు సహించారు కాని వేదప్రామాణ్యాన్ని ఏ మాత్రమైనా అంగీకరించని వారిని సహించలేక పోయారు. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే వారు ఆస్తికులు, వేదప్రామాణ్యాన్ని అంగీకరించని వారు నాస్తికులుగా పరిగణింపబడినారు.......................