యుగయుగాల కాశి
శ్లో॥ విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవమ్ |
వందే కాశీం గుహాం గంగాం భవానీమ్ మణికర్ణికామ్||
ప్రస్తుతం హిందూ ధర్మంగా పిలుస్తున్న అనాదియైన వేదోక్త సనాతన ధర్మాన్ని పాటించే భారతీయులకు భూమాతగా విష్ణుదేవుని భార్యయైన భూదేవిగా పరిగణించబడిన భూమి అంతా పవిత్రమైనదే. అందుకే
శ్లో॥ సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే |
విష్ణుపత్ని నమస్తే ఒస్తు పాదస్పర్శేన క్షమస్వమాం |
అని ఉదయం నిద్రలేస్తూనే భూమి మీద పాదం మోపే ముందు మనమంతా భూమాతను క్షమించమని వేడుకొంటాం. ఉత్తరాన హిమాలయ పర్వతాల నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించియున్న భారత భూమి పవిత్రతరమైనది. ఈ భూభాగంలో కూడా కొన్ని ప్రత్యేక ప్రదేశాలు అంటే నదీ సంగమ స్థలాలు (తీర్థాలు) కొండలు గుట్టలలో వెలసిన అనేకానేక దేవతామూర్తులు ఉన్న ప్రదేశాలు (క్షేత్రాలు) పవిత్రతమైనవి. ఇట్టి పుణ్యక్షేత్రాలలో, తీర్థాలలో అంతటా నిండి ఉన్న ఒకే పరమేశ్వర విభూతి, సామాన్య ప్రజానీకం సేవించుకోటానికి వీలుగా ఆయా దేవతా రూపాలలో కొలువై ఉంటాయి. జనులకు కొంగుబంగారమై సేవించిన వారి మనోవాంఛలను తీరుస్తూ, జీవితాలలో శాంతిని నింపుతూ ప్రత్యేక మాహాత్మ్యం కలిగి దైవశక్తిని, కృపలను వెదజల్లుతూ ఉన్న క్షేత్రాలు చాలానే ఉన్నాయి. వీటన్నింటిలోను మకుటాయమానమై సృష్ట్యాది నుంచి ఉన్నట్లుగా చెప్పుబడుతున్న క్షేత్ర రాజమే కాశి లేక వారణాసి....................