డా॥ జంధ్యాల పరదేశి బాబుగారు పఠనం, రచనం ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవితాన్ని సాగించే సాహితీ సమారాధకులు. నిరంతరం సాహిత్య లోకంలో ఉన్న వ్యక్తులు నిత్య చైతన్యమూర్తులుగా ఉంటారనటానికి ప్రత్యక్ష సాక్ష్యం డా|| జంధ్యాల పరదేశి బాబుగారు వయసులో నాకంటే పది సంవత్సరాలు పెద్ద వారైనా, నా పట్ల వారికి ప్రత్యేక అభిమానం నాకూ వారంటే ఎనలేని గౌరవం. మా సంభాషణల్లో సాహిత్యం తప్ప వేరొక విషయం ప్రస్తావనకు రాదు. బౌద్ధ సాహిత్యం మీద విశేష పరిశోధన గావించిన పరదేశి బాబు గారు సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో రచనలు గావించి తమ ప్రతిభా పాటవాన్ని నిరూపించుకొన్నారు. పదవీ విరమణ తర్వాత పూర్తిగా సరస్వతీ సమారాధనకే అంకిమయ్యారు. ఇందులో భాగంగానే ఇప్పుడు “తెలుగు వెలుగు” అనే సంగీత సాహిత్య రూపకాన్ని వెలువరిస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన ఈ రూపకం శ్రోతల హృదయాల్ని రంజింపజేసింది. పరదేశి బాబుగారికి ప్రశంసలు కురిపింప జేసింది. అదే రూపకం ఇప్పుడు అక్షర రూపంలో తెలుగు పాఠకులకు కనువిందు చెయ్యబోవటం సంతోషకరమైన విషయం.
డా॥ పరదేశిబాబు గారికి పద్యమైనా, గేయమైనా, గద్యమైనా నల్లేరు మీద బండి లాగా సాగిపోతుందనటానికి “తెలుగు వెలుగు” రూపకం నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రూపకంలో పరదేశి బాబుగారు ఆయా కవుల పద్యాల్ని, కవితల్ని సందర్భానుసారంగా పొందుపరచి తమ విజ్ఞతను ప్రకటించారు. పూర్వుల
డా. జంధ్యాల పరదేశి బాబు