చిత్తూరు జిల్లాలో ఏనుగుల ప్రభుత్వం
ప్రభుత్వ యంత్రాంగం, పెత్తందార్లు చేసే ప్రత్యక్ష దాడుల వల్లనే కాక, ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక రాజకీయార్థిక విధానాల వల్ల, నిర్లక్ష్యం వల్ల కూడ ప్రజల జీవితానికీ జీవనానికీ తీవ్రమయిన హాని కలుగుతూ ఉంటుంది.
చిత్తూరు జిల్లా అడవి ఏనుగుల సమస్య, కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల పులుల సమస్య ఈ కోవకు చెందిన పౌరహక్కుల సమస్యలు.
చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు అడవి ప్రాంతం చాలా అందమయిన ప్రాంతం. ఎత్తయిన పీఠభూమి మీద వున్న ఎగుడు దిగుడు నేల, విస్తారమయిన చిట్టడవి, సమృద్ధిగా కురిసే వర్షం, ఆ వర్షం నీటికి ప్రవహించే వాగులు, ఆ నీటిని నిలుపుకొనే చిన్న చిన్న మడుగులు, పెద్ద నీటివనరులేవీ లేకపోయినా ఎప్పుడూ పచ్చగా వుండే పొలాలు - మనుషులు తమకు తాము కష్టాలను కల్పించుకుంటే తప్ప కష్టాలనేవి ఉండనక్కరలేదనిపిస్తుంది ఈ నేలను చూస్తే. వరి, చెరుకు, పప్పుధాన్యాలు, రాగులు, వేరుశెనగ, కొబ్బరి, రకరకాల పండ్లు ఈ నేల ఇచ్చే ఫలసాయం. అడవి అని పేరే గానీ అది క్రూరమృగాలు సంచరించేటంత దట్టమయిన అడవి కాదు. అంతకంటే క్రూరమయిన అటవీ శాఖకు పెద్దగా అక్కరకు వచ్చే అడవీ కాదు ఈ అడవిలో గంధం చెట్లు బాగా ఉండేవి. అవి స్మగ్లర్ల వాతబడి దాదాపు ఖాళీ అయిపోయాయి. టేకు ప్లాంటేషన్లకు యోగ్యమయిన అడవి కాదు. కాబట్టి ఖరీదయిన కలప ఇక్కడ పెద్దగా దొరకదు. అందువల్ల అటవీశాఖ బెడద అంతగా లేదు......................