ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము
ఒకటవ అధ్యాయము
గ్రంథ రచనానుక్రమణిక
“తెలుగదేల యన్న దేశంబు తెలు గేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు కొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స.”
ఈ సువర్ణాక్షరాలు కన్నడ రాజ్య రమారమణుడైన శ్రీకృష్ణదేవరాయలకు స్వప్నంలో దర్శనమిచ్చిన శ్రీకాకుళాంధ్ర విష్ణుభగవానుడు (ఈయనకే తెలుగు రాయడని పేరుకూడ) సెలవిచ్చినవి. ఆ సంగతి వివరిస్తూ కృష్ణదేవరాయలే తన ఆముక్తమాల్యదా ప్రబంధంలో కృత్యాదిని చెప్పిన పద్యమిది. తన ఇంటిలోని భాష కన్నడమే అయినప్పటికీ, కర్ణాటాంథ్రోత్కల ద్రావిడ రాజ్యాలతో కూడిన దక్షిణ భారతమంతా ఏకచ్ఛత్రంగా ఏలిన రాయలు తన ఆస్థానంలో అన్ని భాషల కవి. పండితులను ఆదరించి పోషించాడు. అయినా, తన అష్టదిగ్గజాలని పేరొందిన ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనాది కవీశ్వరులను పోషించడంలోను, తనకుతానై ఆముక్తమాల్యద అనే మహా ప్రబంధం ఆంధ్రంలోనే వ్రాయడంలోను, ఆ గ్రంథపు కృత్యాదిని పై విధంగా పేర్కొనడంలోను, దేశ భాషలన్నింటిలోను తెలుగుకున్న ప్రత్యేక ఘనత ప్రకాశితమైంది. ఆ ఆకర్షణవల్లనే అనాంధ్రులైన అనేకులు దాక్షిణాత్య వాగ్గేయకారులు కూడ తమ మాతృభాషలో కంటే తెలుగులోనే అశేషమైన కృషిచేశారు. పాశ్చాత్య విద్వాంసులు 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అని పేర్కొనడానికి కూడ ఇదే కారణమంటే చర్వితచర్వణం కాబోదు. ఈ సంగతి మొట్టమొదట గ్రహించిన ఘనత ఆంధ్రులై జన్మించిన వాగ్గేయకారులలో ఆది కవియైన తాళ్లపాక అన్నమాచార్యులదే.................