సుగ్గికి పోని కథలు
మారుతి నన్ను మహోదయా అనీ, నేను తనని మహాశయా అనీ బోధించుకుంటాం. మారుతి పౌరోహితం అనే పేరు కర్నూలు నుంచి ఇటీవల వడిగా, వాడిగా వినిపించిన కలం. కథా కలకలం. మారుతి కథా వ్యాసంగానికి ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ, రచనా వ్యాసంగానికి మాత్రం లేటుగా లేటెస్టుగా, ధీటుగా సకాల వానలా వచ్చాడు. కర్నూలు నుంచి కథలు రాస్తున్నవారిలో ఇతను ఇటీవలి వాడే అయినా అతని తరం నుంచి తొలి నవల వెలువరించిన వాడు, పైగా చారిత్రక పరిశోధనాత్మక ప్రణయ గాథని వెలుగుచేసినవాడు. అందుకు నాకు కొంచెం ఎక్కువ మక్కువ ఇతనంటే. అనతి కాలంలోనే తన సంతకం రెండు తెలుగు రాష్ట్రాల్లోని సారస్వత వలయాల్లో అల్లుకుని మెరిపించాడు.
ఈ కథలు చదువుతున్నంతసేపూ ఆలూరు, హోళగొంద నుంచి కోడుమూరు, గూడూరు దాటి నంద్యాల దాకా ప్రయాణం చేసాను ఒక అలౌకిక వాహనంలో. నాలో (తుంగ)భద్రపరిచిన కర్నూలు ఎల్లలు అవి మరి. ఆ కొండరాయనికొండలు, తేలు గుట్టలు, తేటి పాయలు, మొండిగట్టు వాగులు, తుమ్మకంపలు, ఫారం కంపలూ, తురకతొండలూ, దర్గాలూ, చావిడి దండోరాలూ, పంచాయతీ బందెలదొడ్లూ, తారు రోడ్డుకు ఇరువైపులా కెంపు కార్పెట్ పరిచే సుంకేసుల పూలూ, మునుపు ఎక్కడా చూడని గాలిపటాల అనాటమీలూ, అంత్రమంగ వేసుకుని అరచేతిలో ఆడిన నేనె మగ్గం లడీల కొనలతో చేసిన టేకు బొంగరాల ములికీ కొన గిలిగిలి గిరికీలూ, నల్ల గొంగడి గొరవయ్యల భయంగొలిపే ఆహార్యాలూ, వాళ్ళు ఒక చేతిలో ఢమరుకం(డుకుడుకు) దరువేస్తూ మరో చేత్తో పిల్లనగోవి వాయిస్తుంటే 'వాళ్ళు వీళ్ళేనా' అనే డోలాయమానంగా లోలోన చెలరేగే ఆందోళనలూ, అందరికీ దువా చదువుకునే అదను వుండే సాంబ్రాణి మేఘాల దర్గాలూ, పిల్లలం అందరం ఆడుకునే పీర్ల గుండాలూ, తిరణాళ్ళూ, తేరులూ, మెరవణులూ తళుక్కుమన్నాయి చటుక్కున....................