అస్సామి సినిమా ప్రస్థానం 1935లో జ్యోతి ప్రసాద్ అగర్వాలా దర్శకత్వం వహించిన 'జాయ్మతి'తో ప్రారంభమైంది. అస్సామి సినీ చరిత్రలో మూకీలు లేవు. నేరుగా టాకీలతో ఈ సినిమారంగం జన్మించింది. ఆర్థిక నష్టాలు, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుల కొరత వంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఈ పరిశ్రమ పట్టుదలతో అభివృద్ధి చెందింది. గడిచిన కాలంలో గొప్ప సినిమాలు వచ్చినా ఈ పరిశ్రమ మార్కెట్లో పోటీ పడలేకపోయింది. అయినా, అన్ని అవరోధాల నడుమ 2017లో 'విలేజ్ రాష్ట్రార్స్' 91వ అకాడమీ అవార్డులకు భారతదేశం అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. 2019లో బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక ప్రస్తావనను 'బుల్బుల్ కాన్ సింగ్' గెలుచుకుంది.
మొదటి అస్సామి చిత్రం - 'జామ్మతి' - 1935
దర్శకులు, నిర్మాత జ్యోతి ప్రసాద్ అగర్వాలా (జూన్ 17, 1903 - జనవరి 17, 1951)
ఈయన అస్సాంకు చెందిన ప్రముఖ భారతీయ నాటక రచయిత, పాటల రచయిత, కవి, చిత్రనిర్మాత. అస్సామి చిత్ర పితామహుడిగా ఈయన వర్ధంతిని 'సెల్ఫి దివస్' (కళాకారుల దినోత్సవం) గా గౌరవిస్తారు.
మొదటి సినీ నటి – ఐదియు నీలాంబర్ హాన్డిక్ (1920 - డిసెంబర్ 17 - 2002)
సినిమాలో తన భర్త పాత్ర వేసిన నటుడిని బొంగోహోర్డియో (అస్సామీ భాషలో భర్త)గా పేర్కొన్నందుకు సామాజిక బహిష్కరణకు గురై జీవితాంతం అవివాహితగా మిగిలిపోయారు. 'జాయ్మతి' తరువాత ఆమె మళ్లీ ఎప్పుడూ నటించలేదు, ‘గంగా సిలోని' చిత్రంలో ఒక చిన్న పాత్ర, ఆమె జీవితంపై నిర్మించిన చిత్రంలో అతిథి పాత్ర తప్ప ఇక తెరపై కనిపించలేదు. 1985లో, అస్సాం రాష్ట్ర సినిమా స్వర్ణోత్సవాన్ని జరుపుకున్నప్పుడు ఐదియుకు ఈస్ట్ ఇండియన్ మోషన్ పిక్చర్ అసోసియేషన్ వీల్చైర్ను బహుమతిగా ఇచ్చింది. అస్సాం ప్రభుత్వం చాలా కాలం తరవాత ఆమెకు నెలకు రూ.1,500/ - పెన్షన్ ఇచ్చింది. ఆమె పేరును పద్మశ్రీకి కూడా సిఫార్సు చేసింది కాని ఆమె ఒకే ఒక్క సినిమా చేసినందువల్ల ఆ అవార్డు లభించలేదు. 1991లో ఆమె గ్రామంలోని ఒక బాలికల పాఠశాలకు ఆమె పేరు పెట్టారు. మొదటి సినీ నటుడు – ఫణి శర్మ (1910 - 1970)
ఈయన జాయితి సినిమాలో గదపాణి (జాయ్మతి భర్త) పాత్ర వేశారు. అస్సామి నాటకరంగంలో పేరు పొందిన నటులు, "నటసూర్య " అన్న బిరుదు పొందారు. జ్యోతిప్రసాద్ అగర్వాలా రెండవ చిత్రం 'ఇంద్రమాలతి'లో కూడా ఈయన నటించారు. తరవాత 'పియోలి ఫుకోన్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నటించారు. 1963లో వచ్చిన 'ఇతు సిత బహుతు' వీరి ఆఖరి చిత్రం..........................