జననం
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః!
స యత్నమాణం కురుతే లోకస్తదనువర్తతే!! - భగవద్గీత 3 (21)
లోకంలో ఎవరైతే తమ ఆదర్శాల ద్వారా, తమ సౌశీల్యం ద్వారా, నిజాయితీ ద్వారా, చుట్టుప్రక్కల ప్రజల శ్రేయస్సును కోరుతూ జీవిస్తారో, వారు సమాజంలో ఉత్తములుగా, శ్రేష్ఠులుగా పరిగణింపబడతారు. వారి జీవితం మిగిలిన వారికి ఆదర్శ ప్రాయం.
అలాంటి వారి జీవితాలలోని వివిధ సంఘటనలు, వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులూ, వాటిని ఎలా నిగ్రహించుకున్నారో, పరిష్కరించుకున్నారో అలాంటి వారి జీవితాలు మనకు ఆదర్శప్రాయం అని భగవద్గీత చెబుతోంది. వ్యక్తుల జీవిత చరిత్రలను ఎందుకు రాసుకోవాలి... వారి కథల్ని, గాథల్ని ఎందుకు నిక్షిప్తం చేయాలి. అన్న దానికి ఇది చక్కటి సమాధానం.
శత వసంతాల అనగాని భగవంతరావు చరిత్ర వ్రాయడానికి ఈ భగవద్గీత శ్లోకమే చక్కటి ప్రేరణ.
కృష్ణవేణీ తీరాన, పాత గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, నడింపల్లి శివారు 40 గడపలున్న ఓ చిన్న శివారు గ్రామం అనగానివారిపాలెం. జనాభాగా చూసుకున్నా 200 మంది దాటరు. అన్నీ వ్యవసాయాధారిత కుటుంబాలే.
అది జనవరి మాసం. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం. రైతులకు పంట చేతికొచ్చి, సంక్రాంతి సంబరాలు చేసుకొనే రోజులు, ఊరంతా సంక్రాంతి సంబరాలకు సిద్ధమయ్యింది. ఏ ఇంటి ముంగిట చూసినా సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరణ. భోగి పండుగ రోజు.....................