ముందుమాట
భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు?
26 జనవరి 1950లో భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీని డ్రాఫ్టింగ్ కమిటీకి డా॥ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా వ్యవహరించారు. ఇది పూర్తి కావడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇందులో 395 ఆర్టికల్స్ 22 పార్ట్స్, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, భారతదేశ సామాజిక వ్యవస్థను ఒకసారి నిశితంగా గమనించినట్లయితే మనకు కనిపించేది ఏమిటీ? రాజ్యాంగంలో రాసుకున్న దానికి బయట కనబడుతున్న దానికి పోలికే లేదు. పూర్తి భిన్నంగా కనబడుతూ వుంది. అందుకు కారకులెవరూ? కేవలం పరిపాలకులు, రాజకీయ నాయకులు మాత్రమే దోషులు కాదు. కొంతలో కొంత సామాన్య ప్రజలు కూడా బాధ్యులే.
రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి భారతదేశంలో అక్షరాస్యత కేవలం 8-10 శాతం మాత్రమే ఉండేది. నిరక్షరాస్యులైన నాటి భారతదేశ పౌరులు రాజ్యాంగం గూర్చి, చట్టాల గూర్చి తెలియక వాటిపై అవగాహన లేక అజ్ఞానంతో, అంధవిశ్వాసాలతో మతాల్ని, కులాల్ని, అంటరానితనాన్ని పాటించేవారు. అసమానత్వమే సరైన విధానమని భావించేవారు. మరి ఈరోజు 85 శాతం అక్షరాస్యతను సాధించిన భారతీయ సమాజం రాజ్యాంగాన్ని చట్టాల్ని దుర్వినియోగ పరుస్తూ ఉంది. విద్యావంతులైన నేటి నాయకులు, ధనవంతులు, పెత్తందార్లు తమ బాధ్యతల్ని మరిచి రాజ్యాంగంపై గౌరవం లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా ఒక అవినీతి సమాజం, నేర ప్రవృత్తిగల సమాజం, లంచగొండి సమాజం ఏర్పడింది. నిస్సహాయులైన సామాన్యపౌరులు ఈ పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నారు................