అరచేతిలో గ్లోబు
"ప్రియమైన నీరజక్కయ్య నమస్కారం, నీ ఉత్తరం చేరింది. నీకీ ఉత్తరాలు రాసే బెడద తప్పడం కోసం ఇంట్లో ఫోన్ పెట్టించుకోలేని నా అశక్తతకు మన్నించు. అశక్తత మాట అటుంచి, కాలంతో పోటీపడి ఫోన్లో ముక్తసరిగా మాట్లాడడంకన్నా, ఉత్తరాల్లో నింపాదిగా మనసు విప్పి విషయనివేదన చేసుకోవడమంటేనే నాకిష్టం. అన్నట్టు నువ్వు 'ట్రావెలాగ్' రాశావా? రాస్తున్నావా? అసలు రాసే ఉద్దేశం ఉందా? అని నిలదీసి అడిగావు. అక్కయ్యా, నువ్వు కోపగించుకోకపోతే నేనొకమాట చెబుతాను. మాటల్లోగానీ, చేతల్లో గానీ పదిమందినీ అనుసరిస్తూ నడుచుకుంటేనే మనకు భద్రత. లోకంలో ఉన్న నిశ్చితాభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే, వాడికి మునుపటికెప్పుడో భూమి గుండ్రంగా ఉందని చెప్పిన శాస్త్రవేత్తకు జరిగిన సత్కారమే జరుగుతుంది. భారతీయ నాగరికతకు ప్రస్తుతం అమెరికా భజన అన్నది కలికితురాయిగా కుదిరిపోయింది. 'మా పెదనాన్నగారి అల్లుడికి వేలువిడిచిన తమ్ముడు స్టేట్స్లో ఉన్నా'డని చెప్పుకోవడం చాలా గొప్ప 'నాకొడుకు జాబు రాసినాడమ్మా. నలభై ఏడో అంతస్తులో ఉన్న వాడి ఆఫీసులో కూచుని రాసినాడంట' అని చెప్పుకోవడం మరింత గొప్ప......................