పీఠిక
ప్రాచీన కావ్యాలకు అవతారికలు, నాటకాలకు ప్రస్తావనలూ ఉన్నాయి. ఆధునిక సాహిత్యంలో అన్ని ప్రక్రియల రచనలకూ పీఠికలున్నాయి. ఇక్కడ ఆధునికత అన్నది కాలవాచే. తెలుగు సాహిత్యంలో కిందటి శతాబ్దం నడిమిభాగం నుండీ ఆధునిక యుగంగా సాహిత్య చరిత్రకారులు పరిగణిస్తున్నారు. తెలుగు పుస్తకాల ముద్రణ గతశతాబ్దం ప్రారంభంలోనే మొదలైనా ఆ శతాబ్దం ద్వితీయార్ధంలో గాని వేగాన్ని పుంజుకోలేదు. గ్రంథ ప్రచురణ విస్తృతమైన కొద్దీ దానితోపాటు పీఠికారచనా విస్తృతమైంది. గ్రంథనేపథ్యమూ, పరిచయమూ ప్రధానంగా ఉండే పీఠిక ప్రాచుర్యం పొంది గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన బాహ్య సమాచారం లభించసాగింది.
సాహిత్యాభివృద్ధి క్రమంలో, సాహిత్య సిద్ధాంతాలు, భాషా, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక విషయాలకు సంబంధించిన అనేక విషయాల చర్చకు ఈ పీఠికలు తావలమయ్యాయి. అందువల్ల ప్రత్యేకంగా వీటి అధ్యయనావశ్యకత ఏర్పడింది. ప్రధానంగా సాహిత్య విమర్శ రంగంలో పీఠికలు నిర్వహించిన పాత్ర అపూర్వమైనది. తెలుగు సాహిత్య విమర్శను పరిపుష్టం చేయడంలో ప్రత్యేక సాహిత్య విమర్శ ప్రక్రియలు ఎంత కృషిచేశాయో అంతకృషీ పీఠికల్లోనూ జరిగింది.
గ్రంథాన్ని పాఠకుడు అర్థంచేసుకోవడానికి అవసరమయ్యే సమాచారాన్ని ఇవ్వడం పీఠికకు ప్రధాన లక్షణం. గ్రంథం తనంత తానుగా ఇవ్వని, పాఠకునికి అవసరమైన, పాఠకుడు తెలుసుకోగోరే వివరాలను పీఠిక అందిస్తుంది. గ్రంథ పఠనానికి పూర్వరంగాన్ని సిద్ధం చేస్తుంది.
గ్రంథ ప్రచురణలో వ్యాపారధోరణి, రచయితల మితిమీరిన కీర్తి కాంక్ష ఈ ప్రధానలక్షణాన్ని కొంత పలుచ బారేట్టు చేశాయి. గ్రంథ ప్రచారమే ప్రధానోద్దేశంగా, గ్రంథ, గ్రంథ కర్తల ప్రశంసలు చోటు చేసుకున్న పీఠికల సంఖ్య అపారంగా పెరిగిపోయింది. పీఠిక అంటేనే పొగడ్త అనేభావం 20వ శతాబ్దం ప్రారంభంలోనే చోటుచేసుకుంది. 1928 నాటి అక్కిరాజు ఉమాకాంతం 'నేటి కాలపు కవిత్వం'లో...........................