మన దేశంలో అనాది నుండి వేద శాస్త్రలతో ధర్మబద్ధమైన జీవన సరళి కలిగినదై చరించుచున్నది. జన్మించినది మొదలు మరణించు వరకు కర్మానుష్టానమే 'పురుషార్ధసాధనం” కర్మ చేయనిదే జ్ఞానం కలుగదు. జ్ఞానం లేనిదే మోక్షం కలుగదు. అందుకే "జ్ఞానాదేవతు కైవల్యం” అనిగదా ఆర్యోక్తి ధర్మకర్మాచరణ వలన స్త్రీ పురుషాదులకు శరీర శుద్ధమై దోషరహితములగును. కావున నిత్యనైమిత్తికాది కర్మలు అనుసరించుట అత్యావశ్యకం.
ఆధునిక విద్యా విజ్ఞానమేకాక ధర్మాచరణకూడా ఆవశ్యకం. లౌకిక విద్యవల్ల పోషణ మాత్రమేగాని పరమార్ధం లేదని గమనించి వారు ధార్మిక మార్గంలో ప్రవేశించి వారితో పాటుగా తమ వారసులను ధన్యులను చేయుచున్నారు. ఆ కోవకు చెందినవారే మన ప్రఖ్య సదాశివ శర్మగారు. వారి ప్రారంభజీవనం లౌకికంగా కొనసాగిననూ వారి మాతృశ్రీ “శ్రీమతి ప్రఖ్య హైమావతిగారు” ఆశ్శీసులు పూర్ణంగా ఉండుటచే ఆధ్యాత్మిక మార్గులైనారు. ప్రఖ్యావారి కుటుంబసభ్యులతో పరిచయమేకాక సుధీర్ఘ పౌరోహిత్యం కూడా గలిగినది. ఆ అనుభవం వల్ల సదాశివగారి గూర్చి వ్రాయునది ఏమనగా ప్రఖ్యా వంశమునందు జన్మించుట సుకృతమైతే తల్లిగారి ఆదరణ లభించుట మహత్తరమైన భాగ్యం అందువల్లనేమో లౌకిక జీవనం నుండి ధార్మిక జీవనంవైపు మరలుట సంభవమైనది. మరియు నిత్య సంధ్యానుష్ఠాన పరోపకార చిత్తులైరి. అందుచేతనే ఈ "శ్రీకృష్ణ యజుర్వేద సంధ్యావందనము” ఆవిష్కృతమైనది. దీనిని చదివిన ఎవ్వరికైనా వెనువెంటనే ఆచరించు వీలుగా, నేర్పెడి సాయుధ్యముగలుగునట్లుగా తమ బంధు మిత్రులకు ఈ పుస్తకం బహుకరించుటకు అనురక్తులు కాగలనుటలో ఆశ్చర్యములేదు. సంసృతాంధ్రభాష విజ్ఞానములుప్తమగు నేటివారికి కొంతైనా ఊరటనిచ్చి తరింపచేయుననుటలో సందేహం లేదని ఆశిస్తూ, ఏవం స్వీయాశయచూచికం.