మధురవాణి - అడివి బాపిరాజు
మధురవాణి
మంజీరనిక్వాణం
శ్రీరామంభువనైక సుందర తనుంధారాధరం శ్యామలం
రాజీవాయత లోచనం రఘువరం రాకేందు బింబాననమ్
కోదండాది నిజాయుధాశ్రిత భుజైర్భాంతం విదేహాత్మజా
ధీశం భక్తజనాను రంజకపదం శ్రీరామచంద్రం భజే!
నాట రాగములో ఆలపిస్తున్న రామకర్ణామృత శ్లోకము వినపడి ఆలయములోనికి వెళ్ళబోవుచున్న ఆ యువకుడు నాట్యమంటపము వైపునకు దృష్టి సారించాడు. ఆ రాగమంటే అతనికెంతో ప్రీతి.
అప్పుడే నాట్యారంభమైనట్లున్నది. అతనినెవ్వరూ గమనించుట లేదు. ఒక స్తంభము నానుకుని ఆసీనుడైనాడు. ఆ నర్తకి మోమున భక్తి చంద్రికలు తళతళ లాడుతుండగా శ్రీహరి పాదపద్మములకు పుష్పాంజలి సమర్పించినది. ఆ వెనుక గణాధిపతికిని, నటరాజస్వామికిని, శారదాదేవికిని, మన్నారు దేవునకును, చెంగమలవల్లికిని, దిక్పాలురకును, రంగాధిదేవికిని పూజ సలిపినది. అందెల బంగరు మువ్వలు ఘల్లుఘల్లు మన్నవి. రత్నకింకిణులు కరకంకణములు ఝణంఝణం ఝణ ఝణత్కారములు చేసినవి. ప్రేక్షకుల హృదయమార్దంగికము లొక్కమారుగా ఝల్లుమన్నవి.
బృహదీశ్వరాలయ నాట్యమంటపమున ఇంత శోభాయమానముగా జరుగుచున్న కళాసరస్వతీ పూజకు తానేల యాహ్వానింపబడలేదు? ఆ యువకుని హృదయము చిన్నబోయినది, క్షణమాత్రము మరల దృష్టి నాట్యమువైపునకు మళ్ళినది.
ఆమె వామపాదముచే వేధమును దక్షిణపాదముచే విక్షేపమును చేయుచు పరివర్తనము ప్రారంభించినది. జయదేవుని అష్టపది, దశావతారములనెంతో చాతుర్యముగా అభినయించుచున్నది. నాట్యశాస్త్రజ్ఞులకా నాట్యము భరతశాస్త్రపు పుటలు తెరిచినట్లుగా అనుభూతి కలిగినది. నాట్యశోభ అంతా అంగసౌష్ఠవము మీదనే ఆధారపడియున్నది. నాతి ఉచ్చములు నాతి కుబ్జములు కానట్టి అంగములు సౌందర్యకారములు. కటికర్ణములొకే రేఖలోను, మోచేతులు భుజములు ఒకే రేఖలోను.................