ముందుమాటలు
ఇదొక చిన్న ప్రయత్నం
వేమన పద్యం తెలుగువారి జీవన వేదం. అది ఒక అంతర్వాహిని, దేశీ విదేశీ సాహితీవేత్తలూ, విమర్శకులు చాటిన సత్యం ఇది. ఎందరో మహానుభావులు వేమన పద్యాలను సేకరించి, పరిశీలించి, పరిశోధించారు. అర్థ, తాత్పర్య, విశ్లేషణలతో ప్రచురిం చారు. వేమన ఔన్నత్యాన్ని ప్రపంచం ముందు ఉంచారు. మహనీయులు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, దిగవల్లి వేంకటశివరావు, వంగూరి సుబ్బారావు, బండారు తమ్మయ్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, ఆరుద్ర, నార్ల వెంకటేశ్వరరావు, బంగోరె (బండి గోపాలరెడ్డి), మరుపూరు కోదండరామరెడ్డి తదితర సాహితీవేత్తలు, విమర్శకులు, విశ్లేషకులు, మరెందరెందరో శారదామూర్తులు అందరినీ నాటినుండి నేటివరకు వేమన పద్యాలను ప్రచురిస్తున్న ప్రచురణ సంస్థలను స్మరించడం, నమస్కరించడం తెలుగువారిగా మన కర్తవ్యం.
వేమన పేరుతో చలామణి అవుతున్న వేలాది పద్యాలలో రెండు వేల అయిదు వందల పద్యాలు వేమనవిగా పరిశోధకుల అభిప్రాయం. అందునా ప్రత్యేకించి ఆటవెలదులే వేమనవిగా భావిస్తున్నారు. వేమన పద్యాలను మొట్టమొదటగా 1730లో ఫ్రాన్స్ దేశానికి చెందిన సంజీవనాథస్వామి అని పేరుపెట్టుకున్న క్రైస్తవ మతగురువు ఫాదర్ 'లీ గాక్' సేకరించారు. బ్రిటీషు సివిల్ అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ స్వయంగా వేమన పద్యాలను సేకరించి తొలిసారిగా 1829లో పుస్తకంగా అచ్చువర్తించారు. తిరిగి 1839లో కొన్ని సవరణలతో మలి సంకలనాన్నీ తీసుకువచ్చారు. ఈ సంకలనాన్ని యోగి వేమన తెలుగు విజ్ఞానకేంద్రం 1980 బంగోరె సంపాదకత్వంలో పునర్ముద్రించింది. ప్రస్తుత ప్రచురణ లోని పద్యాలు అధికభాగం 1839 సంకలనం నుండి సేకరించినవే.
ఎంపిక చేసిన 349 పద్యాలను వేమన్న ఏమన్నాడు? వేమన తాత్వికత, వేమన తిరుగుబాటు అనే మూడు భాగాలుగా విభజించి ఇందు ఇస్తున్నాను. 1839 సంకలనంలో లేనివి, ప్రాచుర్యం పొందిన కొన్ని పద్యాలను వేమన ఏమన్నాడు? వేమన తిరుగుబాటు విభాగాల చివరన చేర్చాను. పద్యాలకు సీనియర్ పాత్రికేయులు జి.వి.ఎల్. నరసింహారావు సహకారంతో భావాన్ని ఇచ్చాను. 'వేమన గురించి' రాసినదానిలో చరిత్రకారులు, పరిశోధ కుల అభిప్రాయాలను అనుసరించి సమాచారాన్ని పొందుపర్చాను. 'ఎవరేమన్నారు?'..................