ధర్మం వేదాలలో నిక్షిప్తబడి ఉంది. దానిని పద్దెనిమిది మంది ఋషులు, వారి పేర్లతో స్వతులుగా వ్రాశారు. అవి మన ఇతిహాసములు రామాయణ, భారతాలలో చెప్పబడ్డాయి.
మానవుడు సంఘజీవి. సంఘం అంటే సమాజం. సమాజంలో అనేకమంది వ్యక్తులు ఉంటారు. ఒకరి ప్రవర్తన వలన మరొకరికి ఇబ్బంది కలుగకూడదు. ప్రవర్తన అంటే ధర్మం, అందరూ ధర్మాన్ని ఆచరించేవారైతే ఆ సమాజం సుఖసంతోషాలతో ప్రకాశిస్తుంది. సమాజంలోని ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించటానికి, వాని అభ్యున్నతికి దోహదపడేది ధర్మం.
ఇంగ్లీషువాడు - give respect and take respect అన్నాడు. భారతీయుడు, నువ్వు ధర్మంగా ఉండు, ఎదుటివాడు ధర్మంగా ఉండటానికి ప్రోత్సహించు అన్నాడు.
ప్రతి మానవుడు తన జీవనయానంలో అనేక పాత్రలను ధరిస్తాడు. ఎప్పుడు ఏ పాత్రలో ఉంటే దాని ధర్మం పాటిస్తే చాలు, మొత్తం ధర్మశాస్త్రాన్ని వల్లెవేయనక్కర లేదు.
బాలుడు పెద్దలను గౌరవించాలి. విద్యార్థి, శిష్యుడు గురువును సేవించాలి. కొడుకు తల్లిదండ్రులను పూజించాలి. భర్త భార్యాబిడ్డలను పోషించాలి. ఉద్యోగి యజమాని ఆజ్ఞలను పాటించాలి. వ్యాపారి కొనుగోలు దారులతో నిజాయితీగా ఉండాలి. ఇలా ఏ పాత్రలో జీవించే సమయంలో ఆ పాత్ర ధర్మాన్ని ఆచరించటమే మానవుల కర్తవ్యం.
ధర్మాలను ఎప్పటికప్పుడు మన పిల్లలకు తెలిసేవిధంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుత విద్యావిధానం పిల్లలను మరమనుష్యులుగా చేసింది. ధర్మాన్ని తెలియచేసే ప్రాచీన విద్యావిధానానికి తిలోదకాలిచ్చింది. సమాజం అధర్మానికి ఆకర్షితమై అరాచకానికి నాంది పలుకుతోంది.
ధర్మం ఉద్దరింపడాలంటే సమాజం ఆనందంగా ఉండాలంటే మానవుడు ధర్మస్వరూపుడు కావాలి