పరిత్తం
పాళీలో పరిత్తమునకు తాయిత్తు అనే అర్థం కూడా ఉన్నది. రకరకాల పీడల నివారణకు పరిత్తమును పఠించడం 1500 ఏండ్లుగా కొనసాగుచున్నది. పీడల నివారణ కోసమే కాదు, పుణ్యసముపార్జనకు కూడా పఠనం పని చేస్తుందని నమ్మిక. మరణశయ్యపై మృత్యువుతో పోరాడుతూ ఇంకా జీవించియున్న ఆఖరిఘడియల వ్యక్తులకు దీన్ని వినిపిస్తారు. శ్రాద్ధకర్మల్లో వినియోగిస్తారు. ఏదైనా పెద్ద పని చేపట్టినపుడు నిర్విఘ్న సమాప్తిని ఆకాంక్షిస్తూ దీన్ని పఠిస్తారు. సకల జనుల క్షేమాన్ని కోరుతూ కూడా పఠన కార్యక్రమాలు జరుగుతుంటాయి.
సింహళదేశరాజు ఉపతిస్సుని కాలం నుండి (క్రీ.శ. 4వ శతాబ్ది) పరిత్త పఠన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం మొదలయ్యింది. ఉపతిస్సుని పాలనకాలంలో ఒకప్పుడు సింహళద్వీపం అనావృష్టితోనూ అంటువ్యాధులతోనూ పీడింపబడింది. ఉపతిస్సుడు భిక్షుసంఘం పెద్దలను నివారణోపాయం అడిగినాడు. వైశాలి వృత్తాంతాన్ని వాళ్ళు రాజుకు వినిపించినారు. ఉపతిస్సుడు బుద్ధ భగవానుని సువర్ణవిగ్రహాన్ని రథం మీద ప్రతిష్ఠించి విగ్రహ హస్తంలో ఉన్నట్టి భిక్షాపాత్రను జలంతో నింపి నగర వీధుల్లో ఊరేగించినాడు. భిక్షువులు రతనసుత్తాన్ని పఠిస్తూ
కాపాత్రలోని నీటిని వీధుల్లో చిమ్ముతూ తెల్లవారేవరకు పఠన కార్యక్రమం కొనసాగించారు. ప్రజలు కూడా ఆ కార్యక్రమాన్ని చూసి ఉత్తేజాన్ని పొంది పంచశీలను ఖచ్చితంగా పాటిస్తామని దృఢసంకల్పం చేసుకొన్నారు. రతనసుత్త పారాయణ ప్రభావంతో ఉపద్రవాలు అంతరించాయి. వర్షాలు కురిసాయి. జనులు ఆనందించినారు.