రాజద్రోహి
'ఓ... హో... సమస్తమైనవారికి తెలియగలందులకు తెలియపరచేదేమనగా, మన భూతపురరాజ్యంలో కొందరు కుట్రదారులు చేరి కుట్రచేసి రాజద్రోహం తలపెడుతున్నారని విశ్వాసనీయమైనవారి ద్వారా తెలియవచ్చిందోహో...
'అటువంటి రాజద్రోహిగాని ద్రోహులుగాని, అమాయక ప్రజలను మాయచేసి మోసపుచ్చగలరు గాన హెచ్చరికగా వుండవలసిందిగా తెలియచెయ్యటమైనదోహో...?
'ఆ రాజద్రోహులను పట్టి యిచ్చినవారికి మహారాజావారు మంచి యీనాం ముట్టచెప్పగలరు. అలాగాక ఆ రాజద్రోహులకు రక్షణ యిచ్చినా, వారి జాడలు తెలిసివుండిన్నీ చెప్పకపోయినా అట్టివారు కఠినశిక్షకు పాత్రులు గాగలరని ప్రభువులవారు హెచ్చరిస్తున్నారహో...'
ఆనాటి మధ్యాహ్నం భూతపుర రాజవీధిలో సైనికుడొకడు ఒక లొట్టిపిట్టమీద పెద్ద ఢంకానుంచి ప్రతి కూడలి స్థలంలోనూ ఆగి రెండు నిముషాలు ఢంకా మ్రోగించి తగినంత గుంపు పోగయిన వెంటనే పై ప్రకారం ఎలుగెత్తి బిగ్గరగా చాటింపువేసి పూర్తయిన వెంటనే మరి రెండు నిముషాలు ఢంకా బజాయించి అక్కడినుంచి సాగి ముందుకు పోతున్నాడు.
ప్రకటన విన్న ప్రజలు ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. అత్యంత ఉదారహృదయుడు దయామయుడు, సకలసద్గుణ సంపన్నుడూ అయిన తమ మహారాజునకు ద్రోహం తలపెట్టిన రాజద్రోహి ఎవరా? అని ప్రతి ఒక్కరూ తమ ప్రక్కవారివంక ప్రశ్నార్థకంగా చూచేవారే! అంతేగాక వారిలో ప్రతి ఒక్కరు తమ ప్రక్కవారిని చూచి వారే రాజద్రోహి కావచ్చుననుకుంటూ అక్కడ వుండి మాట్లాడితే ఏం ప్రమాదం సంభవిస్తుందో ననుకుంటూ చల్లగా ప్రక్కలకు జారుకోజొచ్చారు. ఇలా ఒక్కక్షణం క్రితం వరకూ అత్యంత ఆప్తులుగా వున్నవారుకూడా ఆ చాటింపు.......................