సేవాలాల్ మహారాజ్ : పవిత్ర జననం
భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో, కొందరి జననం ఒక వ్యక్తి ఆవిర్భావంగా కాక, ఒక యుగానికి సంకేతంగా నిలుస్తుంది. అలాంటి మహనీయులలో సేవాలాల్ మహారాజ్ ఒకరు. బంజారా సమాజ ఆధ్యాత్మిక చైతన్యానికి దివ్యదీపంగా నిలిచిన ఆయన జీవితం, వంశపారంపర్యం, ధర్మపరంపరలతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంది.
సేవాలాల్ మహారాజ్ గారు సూర్యవంశపు రాథోడ్ వంశానికి చెందినవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఈ వంశ మూలాలు వీరపురుషుడు పృథ్వీరాజ్ చౌహాన్ పరంపరతో పాటు రాజస్థాన్లోని పవిత్రమైన రాజపుత్ర వంశాలకు ముడిపడి ఉన్నాయి. ధైర్యం, ధర్మనిష్ఠ, సమాజ సేవ ఇవే ఈ వంశానికి తరతరాలుగా వారసత్వంగా వచ్చిన లక్షణాలు. వీరి పూర్వీకులు రాజస్థాన్ ప్రాంతం నుంచి వ్యాపార, వలస మార్గాల ద్వారా దక్షిణ భారతావనికి చేరుకున్నారు.
పదిహేడవ శతాబ్దంలో బంజారా జాతికి చెందిన బాబా లక్కీషా బంజారా వంటి మహనీయులు తమ సేవాగుణంతో చరిత్రలో నిలిచిన కాలంలో, బంజారా తండాల నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ప్రముఖులలో ఈ వంశానికి మూలపురుషుడిగా భావించబడే రామ్ నాయక్ ఒకరు. రామ్ నాయక్ క్రీ.శ. 1680 ప్రాంతంలో తండా వ్యవస్థను సమర్థవంతంగా నడిపి ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు.
రామ్ నాయక్ గారి వారసుడిగా అవతరించినవారే భీమా నాయక్. సేవాలాల్ మహారాజ్ గారి తండ్రైన భీమా నాయక్ తన తండాకు నాయకుడిగా వ్యవహరిస్తూ ధర్మనిష్ఠతో ప్రజల మన్ననలను పొందిన మహనీయుడు. ఆయన హయాంలోనే ఈ తండా అనంతపురం జిల్లా ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని గుత్తి సమీపంలో ఉన్న ‘గొల్లలదొడ్డి' (ప్రస్తుత సేవాగఢ్) ప్రాంతంలో నివసించింది.......................................