వేదవ్యాస మహర్షి శ్రీ దేవీ భాగవతమ్
ప్రథమ స్కంధం
వినండి... చెబుతాను!
బ్రహ్మదేవుని ఆదేశానుసారం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు యజ్ఞయాగాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒకనాడు వేదవ్యాసుని శిష్యుడు, సకల పురాణవేత్త అయిన సూత మహాముని ఆ పవిత్ర ప్రదేశానికి వచ్చాడు.
మహర్షులందరూ ఆ మహాత్మునికి భక్తిశ్రద్ధలతో అతిథిసత్కారాలు చేశారు. సూతుడు దర్భలతో చేసిన చాప మీద కూర్చున్నాడు.
"సూత మహామునీ ! నువ్వు పురాణాలన్నీ చదివి గురువు అనుగ్రహంతో వాటిలోని రహస్యాలన్నింటినీ చక్కగా ఆకళింపు చేసుకున్నావు. అందుకే నువ్వు చెప్పే పురాణకథల్ని వింటుంటే శ్రోతల రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అందరూ నిన్ను ఆదరంగా 'రోమహర్షణుడు' అని పిలవటానికి కారణం అదే.
మహాత్మా! ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం మా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాం. కలియుగ కల్మషాలన్నింటినీ కడిగేసే శ్రీ దేవీ భాగవతాన్ని నువ్వు మాకు చెబితే వినాలని కుతూహలంగా ఉంది" అన్నారు శౌనకాది మహర్షులు...................