అమరావతి ఎంపికను ఎవరూ అడ్డుకున్నది లేదు. విమర్శలూ, ఉద్యమాలూ రాలేదా అంటే వచ్చాయి. ఇంకా వస్తాయి కూడా. రాజధాని పేరు చెప్పుకుని రాజకీయ బేహారులు సాగిస్తున్న వాణిజ్య క్రీడలే దానికి కారణం. అవసరాన్ని మించిన భూ సమీకరణ చేసి ఆలస్యమవుతున్నా నిర్మాణవేగం పెంచని చంద్రబాబు ప్రభుత్వ ధోరణి అందులో భాగమే. ఈ క్రమంలో దారుణంగా నష్టపోతున్నది పేద, మధ్యతరగతి వర్గాలు. వారి జీవితాలూ, హక్కులే నలిగిపోతున్న స్థితి. పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ అంశాల మధ్య 21వ శతాబ్దపు రాజకీయముంది. తెలుగుదేశం నాయకత్వం నుంచి, వారి మద్దతుదారులైన వాణిజ్యవేత్తల నుంచి అంతర్జాతీయ పెట్టుబడివరకూ విస్తరించిన రాజకీయమది. కేంద్ర రాష్ట్ర పాలక పక్షాలే గాక ప్రధాన ప్రతిపక్షమూ, ఆధిపత్య వర్గాలూ కూడా భాగస్వాములుగా వున్న వ్యవహారమది. ప్రపంచీకరణ క్రమంలో పెట్టుబడి కొత్త పోకడలు, మార్కెట్ అన్వేషణలూ, మాయా వ్యాపారాలూ, నిరుత్పాదకతనూ, నిరుద్యోగాన్ని ఎగుమతి చేసే ప్రయత్నాలూ, ప్రపంచాధిపత్య వ్యూహాలూ ఇమిడివున్న నేపథ్యం తదితర అంశాలను వివరంగా చర్చించిన పుస్తకమిది.