ఆముక్తమాల్యద
'పాప్యులర్' ముద్రణము
ఉపోద్ఘాతావతరణిక
ఆముక్తమాల్యదకు ప్రాచీనకాలము (నూర్ల యేండ్ల) నుండి వ్యాఖ్య ఉండనే యున్నది. అందు చాలమియు తప్పులకలిమియు కలవనియు, దానిచేత అది మూర్ఛితయై యుండెననియు, దానికి సమగ్ర సాధు వ్యాఖ్యచే న జీవనము వలయు ననియు నన్నట్లుగా కీ. శే. కళాప్రపూర్ణ వేదము వేంకటరాయశాస్త్రులవారు తమ వ్యాఖ్యను, మల్లినాథసూరి సంజీవనీ జీవాతు జ్ఞాపకముగా, సంజీవని యని పేరిడి 1927 వ సంవత్సరమునఁ బ్రకటించిరి. కావున అది యిప్పటికి నలువదేండ్లుగా పండితులకును విద్యార్థులకును తత్పఠితలకును కామధేనువుగా వెలయుచున్నది. అవ్యాఖ్య అతివిపులమును ప్రౌఢమును. దానితోడి గ్రంథము ఎక్కువ వెలగలది యైనందున జనసామాన్యమునకు అందుబాటులో నుండునది కాదు. ఆకావ్యము కధయు తరహాయు సారస్యమును జనసామాన్యము అందుకొనఁగలయట్లును చౌకగా నుండునట్లును ప్రకటించుటకు ఇపు ప్రయత్నము. సర్వంకషమగు సంజీవనికి సుదీర్ఘమగు నుపోద్ఘాతము రాయల్ ఆక్టేవ్ (ఇంగ్లీషుబాడి) సన్నని యక్షరములలో డెబ్బది పులకన్నను విస్తృతము గలదు. శాస్త్రులవారి శైలియు పేరా మాటగా ఘట్టితమైనంత యిమిడిక గలది. దానినెల్ల జనసామాన్యమునకు సుబోధముగా నందింపవలయు నన్న రెండు వందల యట్టి పుటలు పట్టును. అప్పుడును అందుగల వ్యాకరణాది శాస్త్రవిషయములు ఆక్షేపసమాధానములు, దీని రచయిత కృష్ణదేవరాయఁడే యగునా అను ప్రశ్నకు సంపూర్ణవిమర్శతోడి నిర్ణయమార్గములు ఇపుడు దీని యుపోద్ఘాతమునకు ఎక్కింపఁదగినవి కావు. శబ్దశాస్త్ర విషయములే నలుబది యేబది శీర్షికలతో ఒక వినూతన ప్రౌఢవ్యాకరణమునకు సామగ్రి కాఁదగినంత యున్నది. ఆది యైనను వ్యాఖ్యాతృసిద్ధాంతము కారు. తప్పులున్నవి కావున ఇది........................