అవసరమైన నేపథ్యం
సమాజ చరిత్రలో ప్రతి తాత్త్విక చింతనకూ, ఉద్యమానికీ స్పష్టమైన మూలాలు ఎక్కడో అంకుర దశలో ఉండి వుండవచ్చు. వైరుధ్యాల తీవ్రత పెరిగినప్పుడు భౌతికస్థాయిలోనూ, భావస్థాయిలోనూ తాత్త్విక చింతనగానీ, ఉద్యమంగానీ, వీటిమూలంగా సాహిత్యంలో తలఎత్తే ధోరణిగానీ ఒక స్పష్టమైన చైతన్య రూపాన్ని తీసుకుంటాయి. ఆ వైరుధ్యాలు సమసిపోయే దాకా, కాకపోతే కొత్తవి తలఎత్తే దాకా.
దళిత తాత్త్వికచింతనా, దళిత ఉద్యమం, దళిత సాహిత్య ధోరణి ఇప్పుడు స్పష్టమైన చైతన్యరూపాన్ని తీసుకుంటున్న దశలో ఉన్నాయి. వీటిని సాహిత్యకారులుగానీ, సామాజికవేత్తలుగానీ తీవ్రంగా పట్టించుకోవలసిన దశ ఏర్పడింది. అయితే చారిత్రక అవగాహనతో పట్టించుకున్నపుడు సంస్కారంలో మార్పు త్వరగా సాధ్యమవుతుంది.
ఎస్వీ ఈ లక్ష్యాలతోనే 'దళిత సాహిత్య నేపథ్యం' సమకూర్చాడు. బలహీన వర్గాల పోరాటానికి తోడ్పాటుగా తమ కలాల ద్వారా అక్షర సంఘీభావాన్ని పాడుకునే పాటలరూపంలో అందించిన 'ఉప్పెన ' (1977)ను అనుబంధంగా సమకూర్చాడు. 'ఉప్పెన' సంకలనం ఇతివృత్తాన్ని బట్టి తెలుగులో మొదటిది. అభ్యుదయ కవులు చూపు దళితులలోనే ఉందనటానికి ఇదొక దృష్టాంతం. అభ్యుదయ రచయితలు, మొత్తం అభ్యుదయ సాహిత్యోద్యమం ఎప్పుడూ వాళ్ళతోనే ఉంది.
ఉంటుంది.
తెలుగులో దళితసాహిత్య నేపథ్యం మీద ఒక పెద్ద పుస్తకమే రాయవచ్చు. పరిశోధనాత్మకంగా ఆధునిక, సమకాలీన దళితేతర రచయితలు, దళిత రచయితలు కవిత్వంలో, కథల్లో, నవలల్లో వ్యక్తంచేసిన.............