పిదప కాలపు పిట్ట కథలు
పాతూరి పూర్ణచంద్రరావు అంటే ఎవరో మనకేమి తెలుసు? కానీ, ఆయన వాళ్ల నాలుగో అమ్మాయికి జాజి అనే ముద్దుపేరు పెట్టి, ఆ పేరుని విడమరచి కూడా చెప్పారని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. జాబిలి వంటి చల్లదనమూ జిలేబి వంటి తియ్యదనమూ కలిసి జాజి అయిందట. ఆ జాజి అలియాస్ మల్లీశ్వరి రాసిన ఈ కథలు చల్లగా తియ్యగా మాత్రమే ఉంటాయని అనుకుంటే కొంచెమేమిటి చాలానే పొరపాటు. చేదుగా, కారంగా, పుల్లగా, వగరుగా, కోపంగా, నిర్దాక్షిణ్యంగా, నిక్కచ్చిగా, ధైర్యంగా - ఎట్లా అయినా ఉన్నాయేమో కానీ, ఈ కథలు సుకుమారంగానో మృదువుగానో మధురంగానో మాత్రం లేవు. జీవితంలాగా ముఖ్యంగా ఈ పిదపకాలపు జీవితంలాగా కన్నీటిపర్యంతంగా, వికటాట్టహాసంగా ఉన్నాయి. ఈ కథలలోని జీవన సారాంశాన్ని, విషాద తాత్పర్యాన్ని గ్రహించడం మాత్రం అంత సులువు కాదు. అనేక సౌందర్యభరిత వాక్యాలు, ఉద్వేగ వ్యక్తీకరణలు కలిగించే విభ్రమను, పారవశ్యాన్ని తప్పించుకుంటూ పాఠకులు బీభత్ససత్యాస్వాదన చేయాలి.
పూర్ణచంద్రరావుతోపాటు, అనూరాధ, నాగవల్లి, పుష్పవల్లి, విజయలక్ష్మి, నాయనమ్మ, బామ్మ, తులమ్మ, చంద్రమౌళి, బేగం, హెప్సిబా, కర్రి లచ్చమ్మ, ఆనంద్వాళ్ల అమ్మ, రిక్షారంగదాసు, చాకలి దాలమ్మ, పద్దయ్య, బూబమ్మ, రాజేశ్వరి, వీరయ్య.....ఇటువంటి పేర్లెన్నో ఈ కథల్లో మనకు తారసపడతాయి. కానీ ఇవి పేర్లో పాత్రలో కాదు. జీవిస్తున్న మనుషులు. రచయిత జీవితంలోని మనుషులు. కానీ, కథలను చదివిన తరువాత వాళ్లు మన జీవితంలోని మన మనుషులతో కలిసిపోతారు. నామవాచకాలు కాస్తా సర్వనామాలైపోతాయి. వారితో ముడిపడిన అనుభవాలన్నీ మన అనుభవాలు అవుతాయి. చివరకు ఇదంతా మనకు తెలిసిందే లెమ్మని నిర్లిప్తత కలుగుతుంది. తెలిసిందాన్ని ఇట్లా చూడవచ్చునా అన్న ఆశ్చర్యం కలుగుతుంది......................