దాదాపు ఏడెనిమిది దశాబ్దాల క్రితం మన రాష్ట్రంలో నిరక్ష రాస్యత ఎక్కువగా ఉన్న రోజుల్లో - అందరికీ తేలికగా అర్థమయ్యే 'వాడుకభాష'లో రచనలు ప్రారంభించి, పాఠకుల్లో పఠనాసక్తిని పెంచారు రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారు. ఆ విధంగా వ్యావహారికాంధ్ర భాషాభివృద్ధికి తన వెయ్యిన్నొక్క నవలల ద్వారా అవిశ్రాంత కృషి చేసిన శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావుగారు 1912లో తణుకులో జన్మించారు. స్వర్గీయ శ్రీ చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి వంటి మహానుభావుల ఆశీర్వాదబలంతో తన రచనల ద్వారా స్త్రీల అభ్యుదయానికి, ఆనాటి సాంఘిక దురాచార నిర్మూలనకి, మరెన్నో సంఘసంస్కరణలకి అప్పటి సమకాలీన సమాజాభివృద్ధికి శ్రీ కొవ్వలి వారు ఎంతో కృషిచేశారు. సాంఘిక నవలా రచయితగానే కాక, వారు సినిమా రచయితగా, కథారచయితగా జానపద డిటెక్టివ్ పౌరాణిక నవలా రచయితగా కూడా శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహా రావుగారు సుప్రసిద్ధులు. వీరు రాసిన కొన్ని డిటెక్టివ్ నవలలు ఈ సంపుటిలో ప్రచురించడం జరిగింది.