ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రాచీన యుగం
ఆంధ్రము - తెలుగు
"ఆంధ్ర" పదం ఆంధ్రదేశానికి, జాతికి, ఆంధ్రభాషకు వర్తిస్తున్నది. 'ఆంధ్ర' అనే పదం 'అంధ్ర' అనే ప్రాచీన పదానికి అర్వాచీన రూపమని ప్రాచీన తామ్ర, శిలాశాసనాలను, వాఙ్మయా లను పరిశీలిస్తే తెలుస్తుంది.
క్రీ.పూ. 600సంవత్సరాలనాడు రూపొందిన ఐతరేయమనే ఋగ్వేద బ్రాహ్మణంలో 'ఆంధ్ర' పదం మొదటి మారుగ కానవస్తుంది. బౌద్ధవాఙ్మయంలో 'అంధకు'లను గురించిన ప్రస్తావన ఉంది. 'సమంతపాసాదిక' అనే బౌద్ధ గ్రంథంలో దమిళులతో పాటు 'అంధు'లు కూడ మ్లేచ్చులుగ పేర్కొనబడ్డారు. 'అంధులు'ను 'అంధకులు'ను ఒకజాతివారే అని భావించటానికి దానిలో అవకాశం ఉంది. కొన్ని బౌద్ధ గ్రంథాలలో గోదావరి తీరంలో 'అంధక రట్ట' (అంధకరాష్ట్ర) ఒకటి కలదని, 'అస్సకులు', 'అళకులు' (ముళకులు) ఆంధ్ర రాజులనీ చెప్పబడింది. ఇందువలన బౌద్ధమత ప్రచార కాలంలో తొలుతటి శతాబ్దాలలోనే అంటే క్రీ.పూ. 5వ శతాబ్దిలో పులలోనే -గోదావరి ఒడ్డున ఆంధ్ర జనపదాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. మౌర్యుల తరువాత బలవంతులుగ లెక్కింప దగినవారు ఆంధ్రులే అని క్రీ.పూ, నాలుగో శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్న మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి ప్రశంసించాడు. అశోకచక్రవర్తి వెలయించిన శాసనాలలో ఒకదానిలో జాతిపరంగ అంధశబ్దం కనబడుతున్నది. పిదప క్రీ.శ. నాలుగో శతాబ్దారంభం నాటి పల్లవరాజుల ప్రాకృత శాసనాలలో 'అంధాపథ' అనే పేరుతో ఆంధ్రదేశం పేర్కొనబడింది (పథం, అపథం, మార్గం అనే పదాలు పూర్వం దేశ వాచకాలుగా ప్రయుక్తాలైనాయి). క్రీ.శ. 6 శతాబ్దంలో ఆంధ్రపదం జనులపరంగ మౌఖరి వంశజుల శాసనాలలో వాడబడింది. ఈవిధంగా ఆంధ్రపదాన్ని జాతిపరంగా వాడినట్లు తెలిపే శాసనాలు మరికొన్ని ఉన్నాయి.
అయిన సంస్కృత పురాణేతిహాసాలలో 'ఆంధ్ర', 'ఆంధ్ర' పద రూపాలు రెండూ కానవస్తున్నాయి. 'ఆంధ్ర' అనే రూపం వాటిలో ఎప్పుడు ప్రవేశించిందో నిర్ణయించటానికి వీలులేదు. ప్రాచీన తెలుగు తాళపత్ర గ్రంథాలను చూసినా వానిలో కూడ 'అంధ్ర' పదమే కానవస్తుంది. వీటిని అన్నింటిని పర్యాలోకిస్తే అంధ్రం మొదట జాతివాచకమనీ, తరువాత అది దేశవాచకంగా రూఢతను పొందిందని, ఈ వాడుక క్రీస్తుశకారంభానికి పూర్వమే జరిగిందని స్పష్టమవుతుంది..................