సాహిత్య సృజన నుంచి సామాజిక కార్యక్షేత్రంలోకి
మంచికంటి, మంచికంటి వెంకటేష్, మంచికంటి వెంకటేశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్లు శాంతివనం మంచికంటి, మరో గ్రంథాలయ ఉద్యమం, ఎన్.ఎస్ సార్, ఎం.వి, వెంకట్... ఒక మనిషికే అనేక పేర్లు. మంచికంటి ఒక కవి, కథకుడు, నవలాకారుడు, ఉపాధ్యాయుడు, సాహిత్య సామాజిక కార్యకర్త.
ఒక పాతికేళ్ళపైగా ఎరిగున్న మనిషిని ఇన్ని పేర్లతో, బహుముఖీన వ్యక్తిత్వంతో, ఒక ప్రాంత సామూహిక సామాజిక చింతనలో పెనవేసుకున్న కార్యాచరణతో, పెనుగు లాడుతున్న అనేక సందర్భాలను ఈరాత్రి పోగు చేసుకుంటున్నాను.
అతడితో నా తొలి పరిచయం కవిగానే ఒంగోలులో. 2000వ సంవత్సరంలో. అప్పటికి జీవించి ఉన్న జె.వి.యన్. మూర్తి, అతని సహచరి కాంతి, శ్రీరామ కవచం సాగరూ... ఇదుగో ఈ మంచికంటీ చాలా రోజుల పాటు బెట్ట గాలుల్లో ఊపిరాడని ఆలోచనలతో తిరిగాం. ఒంగోలు ప్రాంతపు తడిలేని జీవితపు దుఃఖాన్ని మెట్టదనపు కరకు దనంతో కూడిన ప్రజాసమూహాల వేదనల్ని మంగమూరు డొంక రోడ్ల మీదో ఎన్జీవో హోమ్ ఆరు బయట తడి ఆరని ఆకాశం కిందో అంబేద్కర్ భవనం అరుగుల మీదనో కలిసి పంచుకున్నాం. తేమ ఏమాత్రం తగలని అటు ఏరుకాని, ఇటు నదీ కాని గుండ్లకమ్మను ఆవాహన చేసుకుని ఆలోచనలు పంచుకున్నాం.
అనాది నుంచి ఆర్థికంగా రాంజకీయంగా సామాజికంగా ఎంత వెనక బాటుకు గురయ్యామో, గలగలాపారే గోదావరి కృష్ణమ్మలతో కోస్తాగా కలిసి వుండి ఎంత విస్మరణకు ఈప్రాంతం గురయ్యిందో మాట్లాడుకునేవాళ్ళం. ఈ జిల్లా ఏర్పడటమే మూడు జిల్లాల వెనక బడ్డ ప్రాంతాల్ని ముప్పేటగా పేనిన ఒక విషాద నిర్ణయాన్ని తలుచుకున్నాం. అన్ని రంగాల్లో వెనుకబడినా సాహిత్య సాంస్కృతిక రంగంలో ఎర్రన నుండి దిగంబర కవి మహాస్వప్న మీదుగా వీచిన వీస్తున్న గాలుల్ని ఒడిసి పట్టుకుని తలపోసుకున్నాం...................