అది పదహారవ శతాబ్దం!
క్రీ.శ.1550వ సంవత్సరం.
ఎప్పటిమాదిరే ఆ దినం కూడా-
చీకటివెలుగుల యుద్ధంలో తూరుపు, నెత్తురు చిమ్ముతూవున్నది.
ఎర్రగా పొడుచుకొస్తున్నాడు సూర్యుడు.
నున్నగా బలిసిన అరబ్బీజాతి గుర్రాన్ని
దౌడు తీయిస్తూ వస్తున్నాడు ఒక అశ్వికుడు,
ఆనెగొంది వైపు!
అతడు రాత్రికిరాత్రే అత్యవసరంగా గోలుకొండ నుండీ బయలెల్లినాడు.
అతని దగ్గర సుల్తాను గురించి ఒక వార్త వున్నది.
ఆ వార్తను వెంటనే విజయనగర సామ్రాజ్యాధిపతికి చేరవేయవలె.
అతడు రహస్యంగా పనిచేసే వార్తాహరుడు.
అతనికి వార్త చేరవేసిన వేగులవాడు వేరేవున్నాడు.......................