మా నాన్నగారు
వ్యావహారిక భాషలో రచనలు చెయ్యటమే నేరంగా పరిగణించే కాలంలో, పండితుల కోసమే రచనలు చేస్తున్న కాలంలో వాడుక భాషలో పుంఖాను పుంఖాలుగా నవలలు రాసి అక్షర జ్ఞానం వున్న ప్రతివాడి చేత చదివింపజేసిన నవలా రచయితల ద్వయం -కొవ్వలి, జంపనలలో ముఖ్యులు కొవ్వలి లక్ష్మీనరసింహారావు. ఒకనాడు ఊరూరా, వాడవాడలా ఇంటింటా జపించబడిన కొవ్వలివారు అనితర సాధ్యమైన వెయ్యి నవలలు రాశారు. అటువంటి నవలా సమ్రాట్ గురించి వారి కుమారులు కొవ్వలి నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణలు సంయుక్తంగా తెలిపిన జీవిత, సాహిత్య విశేషాలివి...
ఒక రచయిత పాఠకుల మనస్సులను రంజింపచెయ్యటమే కాదు పనికివచ్చే సందేశాన్ని కూడా ఇవ్వాలి. అప్పుడే ఆ రచనకి సార్థకత. గురజాడ, గిడుగు, మునిమాణిక్యం మొదలైనవారు ప్రారంభించిన ఉద్యమాన్ని ఉత్తేజంతో కొనసాగించి సాహిత్య రచనకే తన జీవితాన్ని అంకితం చేసినవారు మా నాన్నగారు - శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావుగారు.
-
మా నాన్నగారు వ్యాపార దృక్పథంతో నవలలు రాయలేదు. సాంఘిక చైతన్యం కోసమే రాశారు. ప్రత్యేకంగా స్త్రీలను ఉద్దేశించి సరళ శైలిలో రాశారు. అందరికీ అర్థమయ్యేలా నవలలు రాసి తెలుగువారిలో పఠనీయతను పెంపొందించారు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యులుగారు పలికిన మాటలు చాలు మా నాన్నగారి గొప్పదనానికి - "నా చిన్ననాడు 1940 ప్రాంతంలో నేను చిన్న తరగతుల్లో చదువుకుంటున్నప్పుడు మా వూళ్ళో ప్రతి వారి చేతుల్లో కొవ్వలి నవల కనపడింది. ఒక్క రాత్రిలో ఒక నవల అవలీలగా కొవ్వలి రచించేవారని చెప్పేవారు. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో నవలా రచనకు విశిష్టమైన స్థానం వుంది. అలాటి ప్రక్రియను ఏనాడో చేపట్టి విజయవంతంగా నిర్వహించిన శ్రీ కొవ్వలి వారు లక్షలాది ఆంధ్ర ప్రజల హృదయాలలో స్థిరమైన స్థానం ఏర్పరచుకొన్నారు.”
1912లో తణుకులో మా నాన్నగారు జన్మించారు. అయితే తండ్రిగారి వృత్తిరీత్యా రాజమహేంద్రవరంలోనే నివసించి రాజమహేంద్రవరం వాసిగానే చెప్పుకొంటారు. చిన్నప్పుడే మాతృవియోగం సంభవించటంతో తండ్రి పెంపకంలోనే పెరిగారు. పూటకూటి యింటి భోజనంతోనే పెరిగారు. పదహారు సంవత్సరాలు నిండేసరికి స్కూలు ఫైనల్ పరీక్ష రాశారు. వేసవి సెలవుల్లో అక్కగారి వూరికి వెళ్ళి అక్కడి గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదవడంతో మా నాన్నగారిలో మార్పు వచ్చింది. మూడు నాలుగు సంవత్సరాలు సంచారం. చేసి కనిపించిన ప్రతి పుస్తకమూ చదివేవారు. తిరిగి ఇంటికి రాగానే తండ్రి కోఆపరేటివ్ ట్రైనింగ్ కోర్సులో ప్రవేశపెట్టారు. కాని ఆయనకి ఆ చదువు మీద మనసు లగ్నం కాలేదు. రాజమహేంద్రవరంలో గల గ్రంథాలయంలోని పుస్తకాలన్నిటినీ చదివారు.
మా నాన్నగారి ఆవేదన ఏమిటంటే - కొంతమందికే అందుబాటులో వుండేలా పుస్తకాల ధరలున్నాయి. సామాన్యులకి అందుబాటులో వుండేలా తక్కువ వెలకు పుస్తకాలు అందించాలి. గ్రాంథిక భాషలో కంటే వ్యావహారిక భాషలో రాస్తే చాలామందికి అందుతాయి......................