ఎవరిదీ భూమి
మొదటి పుస్తకం
నూర్చిన ధాన్యం బస్తాలకెక్కింది.
మూతికుట్టిన బస్తాలు బళ్ళకెక్కాయి.
బళ్ళు కళ్ళంలోంచి కదిలి పుంత దోవ పట్టాయి.
అ బళ్ళలో మొదటిది శంకరానిది. అతని బండి ఎప్పుడూ ముందే ఉండాలి. అనుకున్న మేరకు పంట వచ్చింది. ధర మాత్రం సరిగా లేదు. అంతా తండ్రే చూసుకుంటాడు. ఒళ్ళు వంచి కష్టపడటమే తన పని.
శంకరం బలంగా ఉంటాడు. పొడుగ్గా ఉంటాడు. శరీరకష్టం ఆనందిస్తాడు.
అతని తండ్రి నారాయణ పూర్తిగా భిన్నం. సన్నగా పొట్టిగా ఉంటాడు. ఆయన పుట్టేనాటికి జమిందారీ ఫాయాలో ఉండేది కుటుంబం. పిల్ల జమిందారులా పెరిగాడు. ముగ్గురు ఆడపిల్లల తరవాత పుట్టాడు. తరవాత మరో నలుగురు పుట్టారు. చివరన ఒక మగకుర్రాడు పుట్టాడు. తరవాత గతించాడు. నేలమీద కాలు పెడితే అరిగిపోతాడేమోనన్నట్టు పెరిగాడు. వాళ్ల నాన్న ఎఫ్.ఏ. చదివించాడు..
'భూమి ఉండదురా అది చంచలం. గుంటూరు వేపు అగ్రహారం భూములు అన్నీ నేతి చెంబుల కోసం కరిగిపోయాయని మనవాళ్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా మద్రాసు చేరి తెల్లవాళ్ళ కొలువులో చేములాగ్గా చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన చుట్టాలనూ పక్కాలనూ ఆదుకుంటున్నారు. పేరు తెచ్చుకుంటున్నారు' అన్నాడు తండ్రి.
'రాజాలాంటి ఊరి పెత్తనం వదిలి ఎవడికిందో సలాములు కొట్టుకుంటూ ఛ ఏం బతుకది' అన్నాడు. 'పోనీ అలాగే అనుకుందాం. నువ్వా! ఒక్కడివి. వాళ్ళ! పదిమంది... వాళ్ళతో పడతావా? ఊరితో పడతావా నారాయణా! నువ్వు బాగున్నావా ఊరు నీ వెనక.............................