సీమ సంతకాలు - రాసాని రూపకాలు
ఆ తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో అపారమైన సాహిత్యాన్ని సృష్టించిన అరుదైన, అద్వితీయుడైన కవి, రచయిత డా॥ వి.ఆర్. రాసాని. కథ, నవల, నాటకం, నాటిక, విమర్శ, కవిత్వం ఏది రాసినా అందులో తన ప్రత్యేకతను చాటడం రాసానికి వెన్నతో పెట్టిన విద్య. ప్రక్రియ ఏదైనా సామాజిక స్పృహ రాసాని సాహిత్యానికి ఆలంబన. రాశిలో విస్తృత సాహిత్యాన్ని సృజించినా వాసిలో రాజీపడని, రాయలసీమ తనాన్ని నిలువునా జీర్ణించుకున్న నిండుకుండ రాసాని. అతని ప్రతి రచనలో, సమాజంలో అణగారిన వర్గాలైన దళిత, గిరిజన, మైనారిటీ, బహుజన సామాజిక వర్గాల దారుణ జీవన ఆక్రందనలే ఉంటాయి. ఇంతవరకు ఎవరూ స్పృశించని, ఆధునిక సమాజానికి దూరంగా జీవిస్తున్న వివిధ వృత్తుల, తెగల ప్రజల జీవితాల్లోని చీకటి కోణాల్ని వెలికితీసి, వాటికి సాహిత్య గౌరవం కల్పించిన అచ్చమైన సీమ రచయిత రాసాని. ఎవరి గురించి రాయాలన్నా తాను స్వయంగా ఆయా గ్రామాలకు వెళ్ళి, వారితో మమేకమై, సమాచారాన్ని సేకరించి సాహిత్యంలో చొప్పించే సృజనార్తి రాసానిది. అందువల్లనే అక్షరబద్ధం చేసిన అంశాలు కేవలం రాసాని మాత్రమే రాయగలడు అనే విమర్శకుల మాట అక్షర సత్యం. రాసాని సాహిత్యంలో కల్పన కంటే వాస్తవికతే ప్రధానంగా ఉంటుంది. దానికి బలం చేకూర్చేదిగానే కల్పన ఉంటుంది.
ఉండి రాసాని కథలు, నవలల్లాగే అతని నాటకాలు, నాటికలు కూడా ప్రత్యేకమైనవి. విభిన్నమైన, క్లిష్టమైన సామాజిక అంశాలను స్వీకరించి, జనరంజకమైన నాటకాలుగా మలచడంలో రాసాని తనకు తానే సాటి. తను రాసిన, ప్రసిద్ధి చెందిన కొన్ని కథలను, నవలలను కూడా నాటకాలుగా మలిచి, అందులోని సామాజికాంశాలను విస్తృతంగా ప్రజాబాహుళ్యంలోకి తెచ్చి ప్రచారం కల్పించాడు. తెలుగు ప్రజల్లో నాటకాదరణ బాగా తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో రాసాని నాటకాలు కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకోవడం అతని రచనా పాఠవానికి నిదర్శనం.
32 రాత్రులు సాగే వీరగాథా చక్రం 'కాటమరాజు యుద్ధం' అనే జానపద గాథను ఒక నాటకంగా మలచడంలో రాసాని అనన్య సామాన్యమైన ప్రతిభను ప్రదర్శించాడని డా॥ తంగిరాల వెంకట సుబ్బారావు ప్రశంసించారు. శ్రీ వేంకటేశ్వరుని పరమ భక్తురాలు, సంఘ సంస్కర్త అయిన తరిగొండ వెంగమాంబ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నాటకం" ఆమె..................